Tuesday, April 30, 2024

సుస్థిరత, సమర్థతతోనే పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

ఇక్కడి వేగం.. సమర్థ నాయకత్వం మరెక్కడా లేవని ఫాక్స్‌కాన్ ప్రతినిధులు ప్రశంసిస్తున్నారు
తెలంగాణ వేగవంతమైన పనితీరుకు ఇదే నిదర్శనం
ఐటిలో ఇప్పుడు మనకు పోటీ బ్యాంకాక్‌తోనే 
రూ.4వేల కోట్ల పెట్టుబడి.. 35వేల మందికి ఉపాధి
ఫాక్స్‌కాన్ రాకతో మారిపోనున్న కొంగరకలాన్
ఈ సంస్థలో కొలువుల కోసం యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
పదేళ్లలో 15లక్షల ఉద్యోగావకాశాలను కల్పించడమే లక్షం
దేశంలోనే ఎలక్ట్రానిక్ రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలన్నది కెసిఆర్ అభిమతం: కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్/ఆదిభట్ల: తెలంగాణ రాష్ట్రంలో రానున్న పదేళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం కొంగరకలాన్ లో ఫాక్స్‌కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెని శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి నాయకత్వం వహించేలా మార్గదర్శకంగా ఉండేలా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నదన్నా రు. గత తొమ్మిదేళ్లు రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెంది దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందన్నారు. ఇక్కడ సుస్థిరమైన, సమర్థ్దమైన ప్రభుత్వం ఉండడటంతో పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు.

ఫాక్స్‌కాన్ కంపెనీ రావడంతో 35 నుంచి 40 వేల ఉద్యోగాలు వస్తాయని, మొత్తంగా లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని మంత్రి కేటిఆర్ తెలిపారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టించేందుకు మార్చి 2న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. సరిగ్గా 62 తర్వాత సోమవారం ఆ ప్లాంట్ కు భూమి పూజ నిర్వహించుకున్నామన్నారు. ఫాక్స్‌కాన్ కంపెనీ దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల్లో ఉన్నంత వేగం, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలన్న నిబద్ధత ఇంకెక్కడ చూడలేదని మీడియా సాక్షి గా ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందం చెప్పడం గర్వకారణమన్నారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఉపాధి కల్పన, సంపద సృష్టి అత్యంత సవాళ్లతో కూడుకున్నది.

గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఈ రెండు అంశాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి చెందిన దేశమైనా, వెనుకబడిన దేశమైనా ప్రజలందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అసాధ్యం. అందుకే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడం లేదా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నారు. తొమ్మిదేళ్లుగా దేశ, విదేశాలకు తిరిగి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి లక్షలాది ఉ ద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. రానున్న తొమ్మిది నెల ల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఫాక్స్ కాన్ హామీ ఇచ్చిందని, ఇందులోని ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న ఉద్దేశంతో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలన్నారు.తెలంగాణ తలసరి ఆదాయం 2.5 రెట్లు పెరిగిందని సుమారు 22, 700 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించి 50 బిలియన్ డాలర్ల పెట్టుబడి తో 23 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఈరోజు భారతదేశం 30 సంవత్సరాల కింద చైనా ఉన్న పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుత్వాలు అనుకుంటే 20 సంవత్సరాల్లోనే చైనా సాధించిన ప్రగతిని సాధించేందుకు అవకాశం ఉందన్నారు. తెలంగాణ స్ఫూర్తితో పనిచేస్తే 2040 నాటికి దేశ ప్రజల తలసరి ఆదాయాన్ని ఆరు రెట్లు పెంచి 20వేల డాలర్లకు చేర్చవచ్చన్నారు. దేశంలో గత సంవత్సరం వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాల్లో మూడింటిలో ఒకటి తెలంగాణలోనే వచ్చిందని దేశంలో గత ఏడాది వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాలు 33% తెలంగాణ నుంచి ఉండడం గర్వకారణంమన్నారు.

ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా గుర్తించిందన్నారు. చైనా మాదిరి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఫాక్స్ కాన్ చైర్మన్ తెలంగాణ వేగంపైన ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం మా పైన ఉందని ఆ దిశగా పనిచేస్తాం అన్నారు.500 మిలియన్ డాలర్లను తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫాక్స్ కాన్ కంపెనీ అనుభవాలకు వర్క్‌ఎక్స్‌పీరియన్స్‌కు మించి అద్భుతమైన ప్రస్థానం ఇక్కడ కొనసాగుతుందన్న నమ్మకం ఉందని మంత్రి కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ చైర్మన్ సీడ్నీ కంపనీ ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలిపిన కెటిఆర్ కంపెనీ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందనే భరోసా ఇచ్చారు.రానున్న తొమ్మిది నెలల్లోని ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తుందన్నారు.

ఈ కంపెనీ శంకుస్థాపన తెలంగాణా చరిత్రలో నిలిచిపోతుందని, కంపెనీతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కంపెనీ తమ తయారీ ప్లాంట్లను భవిష్యత్తులోనూ విస్తరించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.తెలంగాణ ప్రభుత్వం తనదైన వినూత్నమైన పరిశ్రమల అనుమతుల ప్రక్రియ టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే దేశంలో ప్రశంసలు పొందుతున్నట్లు చెప్పారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ రంగంలో ఇక్కడి యువతకు శిక్షణ ఇచ్చేలా ఫాక్స్‌కాన్ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా అని మంత్రి కెటిఆర్ అన్నారు.

రాష్ట్ర అభివృద్దిని సహించలేని ప్రతిపక్షాలు ఉన్నాయి
రాష్ట్ర అభివృద్దిని సహించలేని ప్రతి పక్షాలు ఉన్నాయని మంత్రి కెటిఆర్ మండి పడ్డారు. ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజి మ్యాన్యుఫ్యాక్చర్ ఫెసిలిటి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పేపర్లను లీక్ చేసిన పార్టీ నిరుద్యోగ మార్చ్ అంటుంటూ, మరో పార్టీ దశాబ్దాల పాటు అన్ని రంగాల్లో విఫలమై ఇప్పుడొక ఛాన్స్ కావాలి అని అడుగుతుందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. మా ప్రభుత్వం అన్ని రంగాలను, అన్ని వర్గాలను కలుపుకొని సంక్షేమమే ఎజెండాగా ముందుకు పోతున్నది. జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నదన్నారు.అందరికి తాగడానికి మంచినీళ్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది మాదే మాత్రమే అన్నారు. 65 లక్షల మందికి రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం మాది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక పథకాలకు తెలంగాణనే స్పూర్తి అని తెలిపారు. ఈరోజు తెలంగాణలో పట్టణాలు పల్లెలు బాగున్నాయి. మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 30 శాతం జాతీయ అవార్డులను గెలుచుకుందన్నారు.

వ్యవసాయం నుంచి ఐటి దాకా అన్ని రంగాల్లో అగ్ర పథాన దూసుకుపోతున్నదన్నారు.రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావస్తున్నది. దశాబ్దాల పాటు ప్రాజెక్టు కట్టకుండా సతాయించి నీళ్లు ఇవ్వని పార్టీలు, ఉద్యోగాలు ఇవ్వని పార్టీలు ఇవాళ అవకాశం కోసం అడుగుతున్నాయని ఎద్దేవాచేశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు ఇచ్చిన కెసిఆర్ మాత్రమే సాగునీరు కూడా ఇస్తారని ప్రజలు నమ్ముతున్నారన్నారు. మూడు నాలుగు సంవత్సరాలలో కొంగరకలాన్, మహేశ్వరం ప్రాంతాలు సమూలంగా మారాయి. రజనీకాంత్ లాంటి వ్యక్తులు హైదరాబాద్ న్యూయార్క్ నగరంలా మారిందని ఊరికే అనలేదు. నగరం అద్భుతంగా డెవలప్ అయింది కాబట్టి ఇన్ని ప్రశంసలు దక్కుతున్నాయన్నారు. 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి మోడి మోసం చేసిన తర్వాత కూడా బిజెపి నిరుద్యోగ మార్చ్ పేరుతో తిరుగుతున్నదన్నారు.

మోడీ 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు నిరుద్యోగ మార్చ్ అవసరం లేదు. దమ్ముంటే నిరుద్యోగ మార్చ్ మోడి పైన చేయాలి. ఈరోజు రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి అంటే రెండే కారణాలు. ఒకటి సుస్థిరమైన ప్రభుత్వం మరొకటి సమర్థవంతమైన నాయకత్వమని, అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని తిరిగి మామూలు విజయంతో కాకుండా ఢంకా బజాయించి ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకి 100 సీట్లతో ప్రజామోదం ఇవ్వాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజి, ఛైర్మన్, సిఇఒ సిడ్నీలూ మాట్లాడుతూ ప్రపంచవ్యావ్తంగా తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటునామని, తెలంగాణలో ఉన్న విస్తరమైన అవకాశాలను కంపెనీ ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. తమ కంపెనీకి సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ శంకుస్థాపన ద్వారా తెలంగాణ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాప్ లో సుస్థిరమైన స్థానం సంపాదించుకునేందుకు ఉపయోగపడుతుందమ్ముతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News