Friday, July 4, 2025

మౌనం మాటున కుట్ర

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై కెటిఆర్ ఫైర్
ప్రతిపక్షనేతగా ఏడాది పూర్తి చేసుకుంటున్నా..
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఏనాడూ
నిలదీయలేదని ఆగ్రహం బనకచర్లపై మౌనం
కుట్రలో భాగమేనని విమర్శ రాష్ట్ర ప్రాజెక్టులకు
జాతీయ హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించలేదని నిలదీత
హామీలకు నాదీ గ్యారంటీ అని ఇప్పుడు తెలంగాణకే
ముఖం చాటేశారని విసుర్లు తెలంగాణకు ద్రోహం
చేయడానికి బిజెపితో కలిసి పని చేస్తున్నారని ఆరోపణ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై కెటిఆర్ ఫైర్
ప్రతిపక్షనేతగా ఏడాది పూర్తి చేసుకుంటున్నా..
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఏనాడూ
నిలదీయలేదని ఆగ్రహం బనకచర్లపై మౌనం
కుట్రలో భాగమేనని విమర్శ రాష్ట్ర ప్రాజెక్టులకు
జాతీయ హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించలేదని నిలదీత
హామీలకు నాదీ గ్యారంటీ అని ఇప్పుడు తెలంగాణకే
ముఖం చాటేశారని విసుర్లు తెలంగాణకు ద్రోహం
చేయడానికి బిజెపితో కలిసి పని చేస్తున్నారని ఆరోపణ 

మన తెలంగాణ/హైదరాబాద్: ఎంత పెరిగినా గొర్రెకు బెత్తడే తోక అన్నట్టు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సాధించింది ఏం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. లోక్‌సభలో ప్రతి పక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్ గాంధీ, తెలంగాణ సమస్యలు, ఈ ప్రాంతానికి హక్కుగా రావాల్సిన అంశాల మీద ఏ రోజు కూడా మాట్లాడలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణకు ద్రోహం చేయడంలో బిజెపితో రాహుల్ గాంధీ కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాహుల్ మౌనంగా ఉం డడం ముమ్మాటికి కుట్రే అని పేర్కొన్నారు. గోదావరి లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను తన గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ధారాదత్తం చేస్తుం టే ఆపకుండా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 2014 పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ప్రశ్నించలేదని గుర్తుచేశారు. కాళేశ్వరం లేదా పాలుమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యా క్టరీ గురించి కేంద్రాన్ని రాహుల్ ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలని అడిగారు.

విభజన చట్టంలో ఉన్న ఐటి ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటిఐఆర్)ను 2015లోనే మోడీ ప్రభుత్వం రద్దు చేస్తే రాహుల్ గాంధీ మాట మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికారన్నారు. వరంగల్ ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా రాహుల్ వ్యవహరించిన తీరును ప్రజలు ఇంకా మరిచిపోలేదని చెప్పారు. బొగ్గు బ్లాక్‌లను కేటాయించకుండా తెలంగాణ కొంగు బంగారం సింగరేణి అస్థిత్వాన్నే మాయం చేయాలనుకున్న మోడీ ప్రభుత్వ కుట్రలపై రాహుల్ గాంధీ ఏ రోజు కూడా లోక్ సభలో మాట్లాడలేదన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలుచేయలేక రేవంత్ రెడ్డి చతికిలపడితే రాహుల్ తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. హామీల అమలుకు తనదే గ్యారంటీ అని గప్పాలు కొట్టిన రాహుల్, ఇప్పుడు తెలంగాణకు రాకుండా ముఖం చాటేశారని ఆరోపించారు. ఎన్నో ఆశలతో కాంగ్రెస్‌ను గెలిపించిన తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చిన శాపం రేవంత్ సర్కార్ అని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News