Friday, March 29, 2024

బలోపేతం చేద్దాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: 60 లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని దీనికోసం ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో కెటిఆర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ -నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, దీనికి ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని కెటిఆర్ సూచించారు. అందులో భాగంగా ప్రతి పది గ్రామాలను యూనిట్‌గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని కెటిఆర్ ఆదేశించారు. పట్టణాల్లో ఒక్కో పట్టణానికి, లేదా పట్టణాల్లోని డివిజన్లను కలుపుకొని ఈ సమ్మేళనాలు నిర్వహించాలని కెటిఆర్ సూచించారు.

ఏప్రిల్ నాటికి ఈ సమ్మేళనాలు పూర్తి కావాలి

భారత రాష్ట్ర సమితి పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ నిర్ణయించిందని, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు పార్టీ కొన్ని కార్యక్రమాలను స్థూలంగా రూపొందించిందని కెటిఆర్ తెలిపారు. ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ చేపట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీలో పనిచేసే కిందిస్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య ఒక ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఈ సమ్మేళనాల్లో స్థానిక ఎంపిలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్‌లను డిసిసిబి, డిసిఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలని, ఏప్రిల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ ఆత్మీయ సమ్మేళన నిర్వహణ పూర్తి కావాలని కెటిఆర్ పేర్కొన్నారు.

షెడ్యూల్‌ను వెంటనే పార్టీకి అందించాలి

ఈ దిశగా జిల్లా అధ్యక్షులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను కలుపుకునేలా, 10 గ్రామాలకు ఒక యూనిట్లుగా విభజించి… ఆయా యూనిట్లలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించిన సంపూర్ణమైన షెడ్యూల్ (క్యాలండర్) పార్టీకి వెంటనే అందించాలన్నారు. ఏ రోజు ఏఏ యూనిట్ లలో, ఎక్కడ అత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారో తేదీలతో సహా పార్టీకి వివరాలు అందించాలన్నారు. దీంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకోవాలని కెటిఆర్ సూచించారు. ఈ కార్యక్రమం కూడా ఏప్రిల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ వెంటనే సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ విషయంలో పార్టీతో సమన్వయం చేసుకొని, కార్యాలయాల ప్రారంభోత్సవ తేదీలను నిర్ణయించాలని, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మన ప్రభుత్వం, మన పార్టీ నిర్ణయించిందన్నారు. ఆ దిశగా జయంతి ఉత్సవాల కార్యక్రమాలను రూపొందించుకోవాలని కెటిఆర్ సూచించారు.

ప్రభుత్వం, పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి….

ఒకవైపు దేశంలోనే అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మరోవైపు పరిపాలన ఆత్మగౌరవ చిహ్నం అయిన నూతన సచివాలయనికి సైతం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టామని, దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నామని కెటిఆర్ తెలిపారు. ఈ విధంగా దేశ చరిత్రలో ఏ పార్టీ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని స్ఫూర్తిని ఇంత గొప్పగా గౌరవించుకోలేదన్నారు. మన ప్రభుత్వం, మన పార్టీ చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని కెటిఆర్ సూచించారు. జూన్ 1 న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ నేపథ్యంలో విస్తృతంగా పలు కార్యక్రమాలను చేపట్టాలన్నారు. దీంతోపాటు 2023,-24 విద్య సంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టాలని కెటిఆర్ సూచించారు.

త్వరలో పార్టీ కార్యాలయంలో సమావేశం

పార్టీ విద్యార్థి విభాగ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుందని కెటిఆర్ తెలిపారు. పార్టీ విద్యార్థి విభాగం నూతన కమిటీలను వేసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్య కళాశాలలలో నూతన విద్యార్థులకు స్వాగత సభల పేరుతో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సమావేశాలను నిర్వహించుకోవాలని కెటిఆర్ సూచించారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఏప్రిల్ 25న పార్టీ జెండాల ఆవిష్కరణ అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధుల సభ నిర్వహిస్తామని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో పేర్కొన్న అంశాలను పార్టీ ఇచ్చిన కార్యాచరణపై ఈ వారం లోగా పార్టీ కార్యాలయంలోనే మరోమారు సమావేశం ఉంటుందని కెటిఆర్ తెలిపారు. ఈ సమావేశంలో చర్చించిన కార్యక్రమాలపై ఒక స్థూలమైన ప్రణాళికను సిద్ధం చేసుకొని రావాలని కెటిఆర్ వారికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ నాయకత్వంలో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా అందరం కలిసికట్టుగా పనిచేయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News