Friday, March 29, 2024

బుద్ధుడు చారిత్రక పురుషుడు!

- Advertisement -
- Advertisement -

బౌద్ధ సాహిత్యంలో పురాణాల ప్రసక్తి గాని, హిందూ దేవీదేవతల పేరు గాని లేవు. కానీ, రామాయణంలో బుద్ధ శబ్దం వుంది. అంటే అది బుద్ధుడి తర్వాత కాలంలో వెలువడిన రచనగా మనం అర్థం చేసుకోవాలి. బుద్ధుడి కాలం నాటి భాష ప్రాకృత భాష. అదే అప్పటి ప్రజల భాష. ప్రాకృత అంటే ప్రకృతి. స్వభావ సిద్ధంగా ఏర్పడింది అని అర్థం. ప్రాకృతానికి మరో రూపం పాలి భాష. ఈ భాషను ధమ్మ లిపిలో రాస్తారు. దేశంలో దొరికిన అతి ప్రాచీన శిలా ఫలకాలు, స్థూపాలు, బౌద్ధ సంప్రదాయానికి చెందినవి. మరీ ముఖ్యంగా అశోకుడి కాలం నాటివే ఎక్కువగా లభించాయి. ప్రాకృతి భాష సంస్కరించబడి సంస్కృత భాష అయ్యింది. మొదట అది సంభాషణలకు మాత్రమే పరిమితమైన లిపి లేని ఒక మాండలిక భాష. అది ఆర్యుల వ్యవహారిక భాష. భారత దేశం వచ్చాక, ఇక్కడి నాగరి లిపిలో దాన్ని రాసుకున్నారు. దానికి దేవ శబ్దం కలిపి ఆ లిపిని దేవనాగరి లిపి అని అన్నారు. అలాగే సంస్కృతాన్ని ఏకంగా ఉన్నతీకరించుకొని దేవ భాష అని అన్నారు.

అబద్ధాలు నిలవవు అనడానికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే, సంస్కృత భాషలో వున్న శిలా ఫలకాలు దొరకలేదు. అలాంటప్పుడు సనాతనం అంటే ఏదవుతుందీ? బౌద్ధ ధమ్మం ధమ్మ లిపి ప్రాకృత (పాలి) భాష సనాతనమవుతాయి. చారిత్రక ప్రమాణాల మీద కదా మనం ఏ నిర్ణయమైనా తీసుకునేది. సంస్కృతం, పురాణాలు, వైదిక ధర్మం వగైరాలన్నీ సనాతనం అని ప్రచారం చేసుకోవడమే తప్ప, అందరు ఆధారాలు లేవు. అందువల్ల సనాతన మంటే బౌద్ధ ధమ్మం, బౌద్ధ సంస్కృతి అని చెప్పుకోవాల్సి వుంటుంది. చివరికి బుద్ధుడు చెప్పిన ‘వేదన’ నుండే వైదిక మత ప్రబోధకులు వేదం అనే పదం సృష్టించుకున్నారు. మన దేశంలో పురాతన సింధూ నాగరికత బయటపడింది. హరప్పా మొహంజోదారో శిథిలాలలో అవతారాల ఆనవాళ్ళు దొరికితే, వైదిక ధర్మమే సనాతనమైంది అని భావించే వాళ్ళం. కాని, దొరకలేదు. దొరికే అవకాశమూ లేదు. కారణం అవన్నీ కల్పితాలు కాబట్టి! వాస్తవాలకే ఆధారాలు దొరుకుతాయి.

కాని ఊహలకు, కల్పనలకు దొరకవు కదా? అక్కడ అప్పటి నాగరికతకు, సభ్యతకూ ఆధారాలు దొరికాయి. శిలా ఫలకాల మీద ఒక లిపి కూడా దొరికింది. అయితే ఆ లిపిని ఎవరూ చదవలేకపోయారు. కాని, అది ద్రావిడ భాషా లిపులకు దగ్గరగా వున్నట్టు నిపుణులు తేల్చారు. చైనా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి ఆసియా దేశాలలో బౌద్ధం ఇంకా ఎందుకు ఉచ్ఛ స్థితిలో వుంది. భారత దేశంలో ఎందుకు సన్నగిల్లిందీ? అంటే ఇక్కడ బౌద్ధాన్ని వక్రీకరించి రాసుకొన్న వేదాలున్నాయి. బౌద్ధా రామాల్ని కొల్లగొట్టి మార్చుకొన్న దేవాలయాలున్నాయి. రామాయణంలో నాస్తికుల గూర్చి, చార్వాకుల గూర్చి, బుద్ధుడి గూర్చిన ప్రసక్తి వుందంటేనే తెలుస్తోంది కదా? వారంతా పురాణ కాలానికి ముందు వారని! వారి ఆలోచనా విధానం పురాణ కాలాని కంటే ముందు కాలం నాటిదని!! ఒరిజనల్ ఒరిజినలే కాపీ పేస్టు కాపీ పేస్టే! రుగ్వేదంలో స్థూపాల వర్ణన వుందంటే, అది రాయబడిక ముందే బౌద్ధ స్థూపాలు విరివిగా దేశంలో వున్నట్టే కదా? బౌద్ధులు విరివిగా వున్న దేశాలలో అష్ఠాంగ మార్గం అహింస మధ్య మార్గం శాంతి కొత్త దిశ వంటివి అక్కడి ప్రజల జీవితాల్లో అంతర్భాగమైపోయాయి.

ఇక్కడ మన దేశంలో ఎందుకు కాలేక పోయాయి అంటే ఇక్కడ అంతా కలుషితమైపోయింది కదా? బౌద్ధా రామాలు, శిల్పాలు, స్థూపాలు విదేశీ దండయాత్రల వల్ల కొంత వరకు నాశనమైతే, ఇక్కడి బ్రాహ్మణ్యార్యుల, వైదిక ధర్మ ప్రబోధకుల నిర్వాకం వల్ల మిగతాది నాశనమైంది. పైగా మనువాద భావ జాలాన్ని బలవంతంగా జనం మెదడ్లకు ఎక్కించి, అది తరతరాలుగా కొనసాగేట్టు చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. బుద్ధుణ్ణి దశావతారాలలో కలుపుకొన్నది ఆయన బోధనలు నిలుపుకోవడానికి కాదు. నలిపి పారేయడానికి నాశనం చెయ్యడానికి అనేది ముందు అర్థం చేసుకోవాలి! ఇటు హిందూ పురాణాలు, అటు బౌద్ధ సాహిత్యం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ప్రకారం (జాతీ భేద్ క ఉచ్ఛేద్/ Annihilations of caste వంటి పుస్తకాలు) అవతార వాదం అంతా అబద్ధం. విష్ణు దశావతారాలలో బుద్ధుడు తొమ్మిదో అవతారమని ప్రచారం చేయడంలో నిజం లేదు. ఎందుకంటే అవతారవాదమే తప్పుల తడక. ఉదాహరణకు హరివంశంలో విష్ణు ఆరు అవతారాలు ఎత్తాడని వుంటే, నారాయణీయంలో పది అవతారాలు ఎత్తాడని వుంది.

వరాహ పురాణంలో పదకొండు అవతారాలు ఎత్తాడనీ ఆ చివరిదైన అవతారం బుద్ధుడిదనీ రాసుకొన్నారు. అలాగే వాయు పురాణంలో విష్ణు పన్నెండు అవతారాలు ఎత్తాడని రాసుకొంటే, భగవత్ పురాణంలో ఇరవై రెండు అవతారాలు ఎత్తిడనీ, అందులో ఇరవై ఒకటవ అవతారం బుద్ధుడిదనీ రాసుకొన్నారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే వేదాల రచన, పురాణాల రచన సుదీర్ఘ కాలం పాటు సాగింది. కాలానుగుణంగా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకున్నారు. అవతారాలకు నిర్దుష్టంగా ఒక సంఖ్య లేకపోవడం, అందులో బుద్ధుడి వరుస సంఖ్య మారుతూ వుండడం అనుమానాలకు దారి తీస్తుంది కదా? ఊహలకు, కల్పితాలకు ప్రామాణికత వుండదు. కారణం, వాటికి ఏ రకమైన ఆధారాలు వుండవు కాబట్టి! “అవతారాలకు ఆధారాలేవీ?” అని వైదిక ధర్మ ప్రబోధకులను, ప్రవచనకారులను అడిగి చూడండి.

జవాబు చెప్పలేరు సరికదా క్షణంలో తోక ముడిచి పారిపోతారు. చార్వాకులు, లోకాయతులు, బౌద్ధులు, జైనులు.. వీళ్ళందరూ భౌతికవాదులు. వీరు మనుషులకు నైతికత కావాలన్నారు. దృష్టి ఈ జగత్తు మీద పెట్టమన్నారు. సమస్యల్ని పరిష్కరించుకుంటూ, మానవ సమాజాన్ని ఉద్ధరించుకోవాలన్నారు. పీడ నుండి, దుఃఖం నుండి, వేదన నుండి బయటపడే మార్గాలు అన్వేషించుకోవాలన్నారు. దీనికి పూర్తి విరుద్ధంగా వైదిక ధర్మం ఏం చెప్పిందీ? బహ్మ సత్యం అనీ, జగత్తు మిథ్య అనీ అంది.

పుణ్యం, పాపం, జన్మ, పునర్జన్మ, మోక్షం వంటి మూఢ నమ్మకాల్ని వ్యాప్తి చేసింది. ఎక్కడా లేని పరలోకాల గురించి ప్రచారం చేసింది. వెరసి, మనుషుల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీసింది. హిందూ సన్యాసికి ఈ ప్రపంచంతో సంబంధం వుండదు. కానీ, బౌద్ధ భిక్షువుకు ప్రపంచంతో తప్పక సంబంధం వుంటుంది. వారు సామాన్య జనానికి సేవ చేస్తారు. బౌద్ధ ధమ్మం బోధిస్తారు. వీరికి స్వంత ఆస్తి అంటూ వుండదు. ఇకపోతే, హిందువుల దశావతారాల్లో బుద్ధుణ్ణి చేర్చుకున్నారు కదా? బుద్ధుడు హిందూ మతంలో భాగమే అని అంటారు కదా? మరి బౌద్ధా రామాల్ని పరిరక్షించుకోవాలని గానీ, పునరుద్ధరించుకోవాలని గానీ వైదిక సంస్థలకు, నేటి ప్రభుత్వాలకూ ఎందుకు ఉండడం లేదూ? విశాఖ పరిసర ప్రాంతాల్లో వున్న తొట్ల కొండ, పావురాల కొండ, బొజ్జన్న కొండ, లింగాల కొండ లాంటి వన్నీ ఎందుకు నిరాదరణకు గురవుతున్నాయి? విషయాలు తెలుసుకొని, లోతుగా అధ్యయనం చేయవల్సిన విషయం.

ఉదాహరణకు ఇక్కడ ఒక ప్రాంతం గురించి ప్రస్తావించాను కానీ, దేశ వ్యాప్తంగా శిథిలమైపోయిన బుద్ధ విగ్రహాలు, స్థూపాలు, ఆరామాలు ఎన్నెన్నో వున్నాయి కదా? మరి వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదూ? పునరుద్ధరించుకోవడం లేదంటే, అవి తమ వైదిక ధర్మానికి ఏ మాత్రం సంబంధం లేనివి అని వారికి కచ్చితంగా తెలుసునన్న మాట! వైదిక ధర్మాన్ని నెత్తిన పెట్టుకునే ప్రభుత్వ పెద్దలవి నాటకాలు కావా? చారిత్రిక అవగాహన తప్పని సరికదా? “సనాతన” బౌద్ధ ధమాన్ని రక్షించుకుందామన్న చిత్తశుద్ధి అవసరం కదా? మనువాదుల ప్రభావంలో పడి తమను తాము గుర్తించుకోవడం మరిచిపోయిన జనం, ఎప్పుడు వివేకవంతులవుతారో మరి? ఆరామాలని అరాచక కేంద్రాలని ప్రచారం చేశారు. మహా స్థూపాలను అన్యాయంగా ‘లంజెదిబ్బ’లన్నారు. స్థూపాలు దిబ్బలైనాయి.

విహారాలు గబ్బిలాలకు నిలయాలైనాయి. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమని ఒక మహా అబద్ధం ప్రచారం చేసిన వారే ఈ దుర్మార్గాలన్నీ చేశారు. ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తున్న విషయాలు. కొన్ని స్థూపాలు నరసింహ క్షేత్రాలయ్యాయి. తిరణాల స్థానంలో మంత్ర తంత్రాలు ప్రతిష్టించారు. అష్టాంగ మార్గాన్ని అష్టోత్తరాలుగా మార్చారు. పంచశీలను పాతిపెట్టారు. నిబ్బాణకు బదులు వ్రతాల్ని ప్రవేశపెట్టి, గృహిణుల్ని మానసిక బానిసలుగా మార్చారు. పదిహేను వందల ఏళ్ళ పాటు శాంతియుత సుఖమయ, ఆనందకర జీవితాన్ని అందించిన బౌద్ధ జీవన శైలిని ఏ రకంగా నాశనం చేశారో రఘుపతి రావు (2010) ఒక పుస్తకంలో విశదపరిచారు. అశోకుడి కంటే ముందే ‘సనాతన’ సంస్కృతిలో (అంటే వారి వైదిక సంస్కృతిలో) అనేక స్థూపాలున్నాయని కొందరు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సింహ స్థంభ, ధ్వజ స్థంభ, సూర్యా స్థంభ, విజయ స్థంభ వంటి వాటి గురించి చెపుతూ ఇవి భూమి అనంత విశ్వాన్నుంచి విడివడడాన్ని (separation of earth with infinite cosmos) సూచిస్తాయని చెపుతారు. అయితే ఇందులో సింహ స్థంభం, సూర్య స్థంభం బౌద్ధుల శిల్పాలకు పోలికలున్నాయి. అబద్ధాలు ప్రచారం చేసే ఆ మంద మతులు ఆ విషయం గ్రహించలేదు.

ఇకపోతే అశోక స్థంభాల్ని స్ఫూర్తి (మోడల్)గా తీసుకొని తర్వాత కాలంలో కొందరు ప్రాంతీయ పరిపాలకులు కొంత భిన్నంగా స్థూపాలను నిర్మించి వుంటారు. కాదనలేం. కార్బన్ డేటింగ్ చేయించి అవి ఏ కాలంవో నిర్ధారణ చేయిస్తే గాని అసలు విషయం బయటపడదు. ఏమైనా అశోకుడికి ముందు కాలంలో దేశంలో స్థూపాలున్న విషయం ఏ చరిత్రకారుడూ నమోదు చేయలేదు. ఆనాటి చరిత్రకారుల్ని నమ్ముదామా? లేక ఈనాటి ఈ మిడిమిడి జ్ఞానపు వైదిక హిందూ పండితుల్ని నమ్ముదామా? హేతుబద్ధంగా ఆలోచించే వారు నిజమైన ప్రమాణాల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆనాటి వైదిక మత గురువు శంకరాచార్యకు పెద్ద గొంతు, వాదనా పటిమ వుండి వుంటుంది. వుంటే మాత్రం సున్నిత మనస్కులైన బౌద్ధ భిక్షువుల్ని హేళన చేసి, అవమానించి, న్యూనతా భావంతో వారు ఆత్మహత్య చేసుకునే దాకా వదిలిపెట్టేవాడు కాదు. ఉగ్రవాదం అనే పదం ఆ రోజుల్లో లేదు కానీ, అతను ఓ రకమైన ఉగ్రవాదే! మనిషిని మనిషిగా గౌరవించలేని వాడు ఎంత ఉన్నత స్థాయి వాడైనా హీనుడిగానే గుర్తింపబడాలి. ఎంత చిన్నదైనా స్వంత సృజనాత్మక శక్తి గొప్పది.

అరువు తెచ్చుకున్నది అరువు తెచ్చుకున్నదే అవుతుంది. గ్రీకుల కట్టడాలు కాపీ చేసి మందిరాలు నిర్మించుకున్నట్టు ఈజిప్టు, గ్రీకు దేవతల్ని కాపీ చేసి హిందూ దేవతల్ని ఏర్పరుచుకున్నట్టు పూర్తి ఆధారాలు దొరికాయి. లండన్‌లోని పెట్రీ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ ఆర్కియాలజీలో అన్ని ఆధారాలు వున్నాయి. కొన్ని ఆధారాలు ఇంటర్‌నెట్‌లో కూడా దొరుకుతాయి. ఇకపోతే లాభసాటి వ్యాపారాలు నడుస్తాయంటే ఈ మనువాదులు, రేప్పొద్దున అంబేడ్కర్‌ను కూడా దేవుడిగా చేసెయ్యగల సమర్థులు! మనువాదుల మాయాజాలం మహా విచిత్రం. సాధారణ శకానికి ముందు బుద్ధుడు ఈ నేల మీద పుట్టి పెరిగి, దేశం నాలుగు చెరగులా తిరిగిన వాడు. కల్పితం కాదు. మరి కల్పించుకొన్న దేవుళ్ళలో బుద్ధుణ్ణి చేర్చడమేమిటీ? వాస్తవాలకూ భ్రమలకు తేడా తెలుసుకోండి! అందువల్ల .. విష్ణు అవతారాలలో బుద్ధుడు కూడా ఒకడు అని చెప్పడం వంద శాతం అబద్ధం!!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News