Monday, May 13, 2024

ఉగ్రవాదంపై సరళ వైఖరి వారి అభిమతం

- Advertisement -
- Advertisement -

మమతపై నడ్డా ఆరోపణ

బహరాంపూర్ (పశ్చిమ బెంగాల్) : ‘ఉగ్రవాదంపై సరళంగా వ్యవహరించే’ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జెపి నడ్డా ఆదివారం ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో నడ్డా ప్రసంగిస్తూ, మమతా బెనర్జీ సారథ్యంలోని టిఎంసి ప్రభుత్వం అవినీతి, దోపిడీ, బుజ్జగింపు, వివక్షలకు పేరొందిందని అన్నారు. ‘మేము ‘మజ్బూత్ సర్కార్’ గురించి మాట్లాడుతుంటాం.

కానీ మమతా బెనర్జీ ‘మజ్బూర్ సర్కార్’ను కోరుకుంటున్నారు. బుజ్జగింపు, అవినీతి, వివక్షపై విశ్వాసం ఉన్న, ఉగ్రవాదులపై సరళ స్వభావం ఉన్న ప్రభుత్వం ఢిల్లీలో ఉండాలని ఆమె వాంఛిస్తున్నారు. చొరబాటుదారుల పట్ల సుముఖంగా ఉండే, సిఎఎను వ్యతిరేకించే ఆమె బుజ్జగింపు రాజకీయాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఆమె ప్రభుత్వానికి ఉగ్రవాదులపై సానుభూతి ఉంది’ అని కూడా నడ్డా ఆరోపించారు. సుమారు 26 వేల మంది ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చిన స్కూలు ఉద్యోగాల కుంభకోణాల గురించి నడ్డా ప్రస్తావిస్తూ, టిఎంసి పాలనలో అవినీతి, లూటీ పరిపాటిగా మారాయని ఆయన ఆరోపించారు.

‘పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రభుత్వం లెక్కలేని కుంభకోణాలు మినహా మరేమీ ఇవ్వలేదు. ఇటీవల వెలుగులోకి వచ్చిన టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం వల్ల వేలాది మంది జీవనోపాధికి, అవకాశాలకు నష్టం వాటిల్లింది& రాష్ట్రంలో అవినీతి, లూటీ దైనందిన కార్యక్రమాలుగా మారాయని ఇది నిరూపిస్తోంది’ అని నడ్డా పేర్కొన్నారు. నడ్డా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ, వృద్ధ పార్టీ ‘బుజ్జగింపు రాజకీయాలను హేయనీయంగా ప్రదర్శిస్తూ ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి సోదరులు, సోదరీమణుల హక్కులను కబళించాలనే ఆత్రుతతో ఉన్నది, రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలను బుజ్జగిస్తున్నది’ అని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News