Friday, May 16, 2025

సీట్ల దందా షురూ

- Advertisement -
- Advertisement -

నోటిఫికేషన్ కంటే ముందే

మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ
ప్రారంభించిన కొన్ని
ఇంజినీరింగ్ కాలేజీలు
ఆన్‌లైన్‌లో సీట్ల భర్తీకి ఉన్నత
విద్యామండలి ప్రతిపాదనలు
పారదర్శక విధానానికే టాప్
కాలేజీల మొగ్గు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల దందా అప్పుడే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జెఇఇ మెయిన్ పరీక్షలు పూర్తి కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షలు కొనసాగుతున్నాయి. అ యితే జెఇఇ మెయిన్‌లో ర్యాంకు రాని విద్యార్థులు, ఎప్‌సెట్ పరీక్షకు హాజరైన ర్యాంకు వస్తుందనే విశ్వాసం లేని విద్యార్థులు ఇప్పటి నుంచే యాజమాన్య కోటా సీట్లపై ఆరా తీస్తూ తమకు నచ్చిన కాలేజీలో నచ్చిన బ్రాంచీలో సీటు పొందడానికి ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. బ్రాంచీని బట్టి ఒక్కో సీటుకు రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు వినికిడి. జెఇఇ ర్యాంకు, ఎప్‌సెట్ ర్యాంకులను పట్టించుకోకుండా ఎవరు ఎక్కువ ఫీజు ఇచ్చేందుకు ముందుకు వస్తే వారికి నచ్చిన సీటు ఇస్తున్నారు. అయితే టాప్ ఇంజనీరింగ్‌కాలేజీలు మాత్రం పూర్తిగా పారదర్శకంగా జెఇఇ మెయిన్ ర్యాంకుల ఆధారంగా ఇంటర్వూ విధానంలో మేజేన్‌మెంట్ సీట్లు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆన్‌లైన్ విధానం లేనట్లేనా..?
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఈసారి ఆన్‌లైన్ విధానం అమలులోకి తీసుకురావాలని భావించినప్పటికీ ఇప్పటివరకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఏటా బీ కేటగిరీ సీట్ల భర్తీ విషయంలో అనేక ఫిర్యాదు అందుతున్న నేపథ్యంలో దీనికి ఉన్నత విద్యామండలి శాశ్వత విధానాన్ని రూపొందించింది. ఈ మేరకు యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో విధానంలో భర్తీకి సంబంధించిన విధివిధానాల ప్రతిపాదనలు రూపొందించిఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి అందజేసింది. ఆ ప్రతిపాదలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నది. ఇప్పటికే ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఈసారి పాత విధానంలోనే ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎంబిబిఎస్ తరహాలో ఎ,బి,సి కేటగిరీలుగా విభజించి, ప్రభుత్వమే ఫీజు నిర్ణయించి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టే అంశాన్ని ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఎంబిబిఎస్‌లో బి, సి కేటగిరీ సీట్లకు ఫీజును నిర్ణయించి కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్ల కూడా ఎంబిబిఎస్ తరహాలోనే భర్తీ చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

30 శాతం సీట్ల భర్తీలో నిబంధనలు భేఖాతరు
రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో 70 శాతం కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్లను మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా కౌన్సెలింగ్ విధానంలో ప్రభుత్వం భర్తీ చేస్తుండగా, మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం బీ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద నింపుతున్నారు. నిబంధనల ప్రకారం ఈ విభాగం సీట్లను జెఇఇ మెయిన్ లేదా ఎప్‌సెట్ ర్యాంకు లేదా ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. వాటికి కూడా ప్రభుత్వం నిర్దేశించిన కన్వీనర్ కోటా ఫీజును మాత్రమే వసూలు చేయాలి. కానీ అందుకు భిన్నంగా మెరిట్‌ను పట్టించుకోకుండా, ఎక్కువ చెల్లించేందుకు ఎవరు ముందుకొస్తే వారికే యాజమాన్యాలు అమ్ముకుంటున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను యాజమాన్యాలు, కన్సల్టెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. తాము మాట్లాడుకున్న ఫీజు వివరాలు బయటకి చెబితే సీటు పోతుందేమో అని తల్లిదండ్రులు కూడా మేనేజ్‌మెంట్ కోటా ఫీజు విషయాల గురించి ఎవరితో మాట్లాడటం లేదు. వారికి పరిచయం ఉన్న కన్సల్టేన్సీలు, యాజమాన్యాలతో నేరుగా బేరసారాలు జరిపి సీటు ఖరారు చేసుకుంటున్నట్లు సమాచారం. దాదాపు అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో సిఎస్‌ఇ, దాని అనుబంద కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్ వంటి బ్రాంచీలకే అధిక డిమాండ్ ఉంది. ద్వితీయ శ్రేణి కాలేజీలు కూడా ఈ బ్రాంచీల సీట్లను రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని కాలేజీ యాజమాన్యాలైతే కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని, కమీషన్ ప్రాతిపదికన సీట్లు అమ్ముకుంటున్నట్లు తెలిసింది.

ఏటా రూ.కోట్ల రూపాయల వసూళ్లు దందా
రాష్ట్రంలో 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, అందులో 20 వేలకుపైగా సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ అవుతున్నాయి. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిఫియల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ బ్రాంచీల్లో ఒక్కో సీటును రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వద్ద సమాచారం ఉన్నట్లు తెలిసింది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు గరిష్ఠంగా ఏడాదికి 5 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా అంతకు రెట్టింపు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సగటున ఒక్కో సీటు రూ.5 లక్షలకు అమ్ముకున్నా యాజమాన్యాలు కోట్లలో దండుకుంటున్నాయని అంచనా. మరోవైపు సీట్ల అమ్మకం వ్యవహారంపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఏటా ఉన్నత విద్యా మండలి అధికారులకు ఫిర్యాదులు చేయడంతోపాటు ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కొన్నిసార్లు పోలీసు బందోబస్తు కూడా నిర్వహించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తమకు తక్కువ మొత్తానికి సీట్లు ఇప్పించాలంటూ ప్రజాప్రతినిధులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, ఆఫీసుల్లో తిష్ట వేస్తున్నారని ఉన్నతాధికారులే చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News