Saturday, April 27, 2024

భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

రైలులో తరలిస్తున్న గంజాయిని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో గురువారం ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న యువకుడిని అరెస్టు చేసి, 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన రాహుల్ అనే యువకుడు పది కిలోల గంజాయిని తీసుకుని రైలులో హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి ఇచ్చేందుకు బయలు దేరాడు. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుల్లో వస్తే పోలీసులు పట్టుకుంటారని భావించిన నిందితుడు రైలులో బయలు దేరాడు. సాధారణంగా రైలులో చాలా మంది ప్రయాణికులు వస్తుండడంతో తనిఖీలు చాలా తక్కువగా చేస్తుంటారు. దీనిని అవకాశం తీసుకుని నిందితులు గంజాయిని రైలులో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలి ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్న విక్రమ్ అనే వ్యక్తికి అప్పగించేందుకు వచ్చాడు. ఈ విషయం ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో గంజాయి తీసుకుని వస్తున్న రాహుల్ రైలు దిగగానే పట్టుకున్నారు. రాహుల్‌తో గంజాయి పంపించిన ఒడిసా రాష్ట్రానికి చెందిన జగన్నాథ్ బిస్వా, హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన విక్రమ్ పరారీలో ఉన్నారు. గంజాయి తరలిస్తున్న రాహుల్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలియగానే విక్రమ్ పరారయ్యాడు. నిందితులపై ఎన్‌డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News