Saturday, April 27, 2024

వనదేవతల ఆశీస్సులతో గిరిజన వర్సిటీ ప్రారంభం: మంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆదివాసీ వనదేవతలు సమ్మక్క, సారలమ్మల ఆశీస్సులతో గిరిజన యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభించినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ములుగు మండలం, జాకారం గ్రామంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో సమ్మక్క, సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపన్‌ను శుక్రవారం పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవితతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన ప్రాంతంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించడం చాలా సంతోషకరమని, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనుల అక్షరాస్యత 49 శాతంగా ఉందని, గిరిజన మహిళలలో 39 శాతంగా ఉందని, వారిలో 100కు వంద శాతం అక్షరాస్యత శాతం పెంచడమే ముఖ్య ఉద్దేశంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశామని అన్నారు.

ప్రభుత్వం సమ్మక్క, సాలరమ్మ సెంట్రల్ యూనివర్సిటీ కోసం 889.07 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని తెలంగాణ ప్రాంతంలో ఉన్నత విద్య ప్రాముఖ్యత, నాణ్యతను మెరుగుపరచడానికి ఇదొక సువర్ణ అవకాశమని అన్నారు. 2024-=25 విద్యా సంవత్సరం నుండి ప్రస్తుతం ఏర్పాటు చేసిన జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో బిఏ ఇంగ్లీష్, బిఏ సోషల్ స్టడీస్ రెండు కోర్సులతో తరగతులను ప్రారంభిస్తామని అన్నారు. స్థానిక యువత యూనివర్సిటీలో ప్రవేశం కోసం దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ యూనివర్సిటిలో 35 శాతం ప్రత్యేకంగా గిరిజన విద్యార్థుల కోసం సీట్లను కేటాయించామని తెలిపారు. త్వరలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యూనివర్సిటీకి భూమి పూజ చేయడానికి సన్నాహాలు చేయాలని, యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణ పనుల కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ యూనివర్సిటీలో గిరిజనుల ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు, సాంప్రదాయాలపై రీసెర్చ్ యూనిట్ ఉంటుందన్నారు. ఈ యూనివర్సిటీకి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ మెంటర్‌గా వ్యవహరిస్తుందన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ ..ములుగు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని, ఈ ప్రాంతం ముఖ్యంగా టూరిజం హబ్‌గా మాత్రమే ఉందని, యూనివర్సిటీ ఏర్పడుతూ టూరిజంతో పాటు ఎడ్యుకేషన్ హబ్‌గా ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా, అనేక టూరిజం ప్రాంతాలతో ఉందని దేశం నలుమూలల నుండి సందర్శకులు, పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి పెట్టి మరింత అభివృద్ధి చేయడం కోసం నిధులు మంజూరు చేయాలని తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అన్నారు. మహబూబాబాద్ ఎంపి కవిత మాట్లాడుతూ.. ఈ ప్రాంత ఆరాధ్య దైవాలుగా ఉన్న సమ్మక్క, సారలమ్మ వనదేవతల పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, యూనివర్సిటీ ఏర్పాటుతో స్థానిక గిరిజన యువతకు విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటి డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ శర్మ, డిప్యూటీ రిజిస్ట్రార్ అభిషేక్ కుమార్, సిస్టం అనాలసిస్ అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News