Saturday, April 20, 2024

అంగన్ వాడీలకు ఆత్మగౌరవం: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

 

సిద్దిపేట : అంగన్ వాడీలకు దేశంలోనే అత్యధిక వేతనం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రధాని స్వంత రాష్ట్రమైన గుజరాత్ లో అంగన్ వాడీ టీచర్లకు తక్కువ వేతనాలు ఉన్నాయని, కానీ మన తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్ వాడీ టీచర్లకు రూ.7800, అంగన్ వాడీ హెల్పర్లకు రూ.7800 చొప్పున అత్యధిక వేతనాలు ఇస్తున్నట్లు.. ఇలా దేశంలో మరేదైనా రాష్ట్రంలో ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులు వెంటనే భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

జిల్లా కేంద్రమైన సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లాలోని సిద్ధిపేట-7-12, గజ్వేల్-4-3-28, హుస్నాబాద్-2-3-12, దుబ్బాక-4-1-10, చేర్యాల-4-0-14 .. ఇలా మొత్తం (104) 21-అంగన్ వాడీ టీచర్లు, 7-మినీ అంగన్ వాడీ టీచర్లు, 76-అంగన్ వాడీ హెల్పర్లకు మొత్తం 104 మందికి మంత్రి చేతుల మీదుగా అపాయింట్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్ వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం ఉండగా., బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుని, కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యతల నుంచి తప్పుకుంటుందని మంత్రి విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాల్సి ఉండగా, అంగన్ వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తున్నదని ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ వేతనాలకు తన వాటా కింద 40 శాతం వాటా ఇవ్వాల్సి ఉండగా, అంగన్ వాడీలకు ఇచ్చే వేతనాల్లో రాష్ట్రం వాటా 80 శాతం, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉండటం మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యానికి, అంగన్ వాడీల పట్ల ఆయనకు ఉన్న ప్రేమకు ఇదొక నిదర్శనమని మంత్రి వెల్లడించారు.అంగన్ వాడీలు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ యేడాది అక్టోబరు నెలలో 30 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ యేడాది జూలై నెల నుంచి అమలు చేస్తామని ప్రకటించి, పెంచిన వేతనాలు డిసెంబరు నెల నుంచి అంగన్ వాడీ ఉద్యోగుల ఖాతాలలో పడుతున్నాయని చెప్పేందుకు సంతోషిస్తున్నట్లు, దీనితో 67 వేల 411 మంది అంగన్ వాడీ ఉద్యోగులకు లబ్ధి చేకూరిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్ వాడీల వేతనాలను 2018 సెప్టెంబరులో ఒకసారి పెంచితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అంగన్ వాడీల వేతనాలను మూడుసార్లు పెంచారని మంత్రి గుర్తు చేశారు. 2015 మే నెలలో జీఓ ఏం.ఎస్.15 ద్వారా అంగన్ వాడీ టీచర్ల వేతనాలు 4200 నుంచి 7 వేలు, అంగన్ వాడీ మినీ టీచర్లకు-హెల్పర్లకు రూ.2200 నుంచి రూ.4500 రూపాయలకు పెంచింది. 2017 మార్చి నెలలో జీఓ ఏం.ఎస్.3 ద్వారా అంగన్ వాడీ టీచర్ల వేతనాలు రూ.7 వేల నుంచి రూ.10,500, అలాగే అంగన్ వాడీ మినీ టీచర్లు-హెల్పర్లకు రూ.4500 నుంచి రూ.6వేలకు పెంచింది.

తాజాగా 2021 సెప్టెంబర్ నెలలో జీఓ ఎం.ఎస్.47 ద్వారా అంగన్ వాడీ టీచర్ల వేతనాలు రూ.10,500 నుంచి రూ.13,650 అలాగే మినీ అంగన్ వాడీ టీచర్లు-హెల్పర్లకు రూ.6 వేల నుంచి రూ.7800 రూపాయలకు పెంచింది.దేశంలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వడం లేదు.ఢిల్లీ, కేరళలో 10 వేలు ఇస్తుంటే, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 7 వేలు మాత్రమే ఇస్తున్నారు.హెల్పర్ల జీతాలు రూ.5 లేదా రూ.6 వేలకు మించడం లేదు.బీజేపీ పాలిత గుజరాత్ లో 7వేల 800 ఉండగా, ఉత్తరప్రదేశ్ లో 8 వేలు ఇస్తున్నారు.కేంద్రం ఇచ్చే గౌరవ వేతనంతో పనిలేకుండా మన సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారు. అరకొర సౌకర్యాలు, అగౌరవంగా నడిచే అంగన్వాడీలను పక్కా భవనాలు, స్కూల్స్ లోకి మార్చి మరింత గౌరవం పెంచాలని సీఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారు.తెలంగాణ వస్టే ఏమొస్తదని.. అన్నోళ్లకు సమాధానమే మా అడ పడచులు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు.. ప్రతి ఒక్క మహిళ సాధికారత దిశగా అడుగులేస్తున్నదని మంత్రి హరీశ్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News