Monday, April 29, 2024

కెసిఆర్‌కు రేవంత్ క్షమాపణ చెప్పాలి: జగదీశ్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నారని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు,మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌పై వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని, నీచంగా దిగజారుడు తనంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డి కెసిఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఎంఎల్‌ఎలు కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్యలతో కలిసి మంత్రి జి .జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వాడిన భాషను జగదీశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక నాయకుడు మాట్లాడే మాటలు ఇవేనా..? అంటూ రేవంత్‌రెడ్డిని నిలదీశారు. టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కొన్ని పార్టీలు చెప్పుకోవడానికి ఏమి లేక ఇష్టానుసారం అబద్ధాలు, బూతు పదాలు వాడుతున్నారని మండిపడ్డారు. చేసింది చెప్పుకొని ప్రజలను ఓట్లు అడగచ్చని సూచించారు.

తెలంగాణ కంటే తమ రాష్ట్రంలో గొప్పగా అభివృద్ది చేశామని కర్నాటక కాంగ్రెస్ నాయకులు చెప్పాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ వల్ల తెలంగాణ నాశనమయ్యిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో కరెంట్ లేదని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని, కరెంట్ ఉందో లేదో వైర్లు పట్టుకుందామా..? అని ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్ నాయకులు కరెంట్ వైర్లు పట్టుకోవాలని, వాళ్లు బ్రతికి ఉంటే తాను పట్టుకుంటానని పేర్కొన్నారు. అలాగే కర్ణాటకలో కూడా చూద్దామని చెప్పారు. ఇవాళ టికెట్లు అమ్ముకున్న వ్యక్తి రేపు రాష్ట్రానికి సిఎం అయితే రాష్ట్రాన్ని ఏం చేస్తారో ప్రజలు గమనించాలని కోరారు. బ్రోకర్ పనులు చేసి వచ్చిన వ్యక్తులు పిసిసి చీఫ్ అయితే ఇలాగే ఉంటుందని విమర్శించారు. దళిత నేతల దగ్గర కూడా టికెట్ కోసం డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపికి నాలుగు ఓట్లు వచ్చే పరిస్థితి కూడా లేదని, ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ప్రధాని మోడీ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News