Monday, April 29, 2024

తెలంగాణ రాష్ట్రంలోనే క్రైస్తవులకు రక్షణ : మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు అన్ని విధాలా మేలు జరుగుతోందని ఎస్‌సి అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పలువురు బిషప్ లు, చర్చి ఫాదర్లు, క్రైస్తవ మత పెద్దలు మంత్రి కొప్పుల ఈశ్వర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ సారాధ్యంలో చర్చీల నిర్వహణ, సంక్షేమ, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిందన్నారు. సబ్బండవర్గాల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ కృషిచేస్తున్నారని చెప్పారు.ఉప్పల్ భగాయత్‌లో సుమారు రూ.70 కోట్ల విలువ చేసే రెండెకరాల విస్తీర్ణంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. భవన నిర్మాణానికి పది కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

రూ.42 కోట్ల వ్యయంతో భవనం నిర్మాణానికి వ్యయం అవుతుందని అంచనా వేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బరియల్ గ్రౌండ్ నిర్మాణాల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. వివిధ ప్రాంతాల్లో 62ఎకరాల స్థలం గుర్తించి 42 ఎకరాలు స్వాదిన పర్చుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర మున్సిపల్,ఐటి శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో పది కోట్ల రూపాయలు మంజూరు చేశారాని, సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తడంతో నిలిచి పోయాయని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపు తున్నామని వెల్లడించారు. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదని చెప్పారు.

క్రైస్తవులకు సంబందించిన ఇతర సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉమ్మడి జిల్లాకు రెండు చొప్పున కేటాయించాలని క్రిస్టియన్ మైనారిటీ పెద్దలు కోరారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్‌ను నియమించాలని, ప్రభుత్వ కార్పొరేషన్ పదవుల్లో క్రైస్తవులకు అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు.మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాల ఘటనలను వారు ఖండించారు. రాష్ట్రం లో ఇందుకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాలకు అనుమతించాలని కోరారు. రాష్ట్రం లోనూ వేర్వేరు ప్రాంతాల్లో కొందరు క్రిస్టియన్ ల పై దాడులకు పాల్పడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారు ఎకె ఖాన్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ సెక్రటరీ ఉమర్ జాలిల్, క్రిస్టియన్ మైనారిటీ నేతలు రాయడన్ రోచ్, రిటైర్డ్ రెవరెండ్ డాక్టర్ జాన్ గొల్లపల్లి, రెవరెండ్ బిషప్ టిమోటి, రెవరెండ్ దివన్ కుమార్, రెవరెండ్ వై. మోహన్, రెవరెండ్ జి ఎస్. కలిస్టర్, రెవరెండ్ ఫాదర్ మాత్యు, రిటైర్డ్ రెవరెండ్ మొసెస్ ఆశీర్వాదం, రెవరెండ్ పురుషోత్తం, బ్రదర్ జాన్ వేస్లీ, మేజర్ ఫిలిప్ రాజు, రెవరెండ్ జి ఎస్. మోసెస్, బ్రదర్ రాబెన్ ఫ్రాన్సిస్, రెవరెండ్ ఫాదర్ వినయ్, రెవరెండ్ ఏడ్వార్డ్ రోస్, రెవరెండ్డాక్టర్ జె. చిరంజీవి, సిస్టర్ థామస్ అమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News