Monday, August 25, 2025

పారిపోయేందుకు గోడ దూకిన ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

పశ్చిమబెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ )పలువురు నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈడీ అధికారులు ముర్షిదాబాద్ జిల్లా లోని తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ జిబన్ కృష్ణ సాహా నివాసం సహా ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాలపై దాడులు నిర్వహించారు. అయితే సోదాల గురించి తెలుసుకున్న ఎమ్‌ఎల్‌ఎ తమ ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి , గోడ దూకి పారిపోయేందుకు యత్నించారు. ఇంటి బయట కాపలా అధికారులు కృష్ణసాహాను గుర్తించి అదుపు లోకి తీసుకున్నారు. పారిపోయే క్రమంలో ఎమ్‌ఎల్‌ఎ తన వద్ద ఉన్న సాక్షాలను ధ్వంసం చేసేందుకు తన మొబైల్ ఫోన్‌ను ఇంటికి సమీపంలోని చెరువు లోకి విసిరేసినట్టు అధికారులు తెలిపారు. మరో రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపామన్నారు.ఇంటి నుంచి పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించారనే విషయంపై కృష్ణ సాహాను విచారిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

అనంతరం ఆయనను కోల్‌కతా లోని ప్రత్యేక ఈడీ కోర్టు ముందు హాజరుపరుస్తామన్నారు. రఘునాథ్ గంజ్ ప్రాంతం లోని ఎంఎల్‌ఎ అత్తమామలకు చెందిన ఇళ్ల లోనూ సోదాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 2023 ఏప్రిల్‌లో సీబీఐ అధికారులు కృష్ణ సాహాను అరెస్టు చేశారని, 2025 మేలో ఆయనకు బెయిల్ మంజూరయ్యిందని తెలిపారు. ప్రభుత్వ ప్రాయోజిత ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతోపాటు గ్రూప్ సి, గ్రూప్ డీ స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2018 లో బెంగాల్ సర్కారు రాష్ట్రస్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్ మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News