Sunday, April 28, 2024

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్‌పై ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం

- Advertisement -
- Advertisement -

దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్
అభినవ చాణక్య సిఎం కెసిఆర్
అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సిఎం కెసిఆర్
మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం కెసిఆర్‌కు రెండు కళ్ల లాంటివి
ఒకనాడు బీడు భూముల తెలంగాణ..నేడు పచ్చని పొలాలతో సిరి సంపదలతో సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది
నా తెలంగాణ కోటి రతనాల వీణ, నేడు కోటి ఎకరాల మాగాణి
పని చేశాం…మూడోసారి ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది
భారీ మెజారిటీతో మూడోసారి బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్సూచి అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. సిఎం కెసిఆర్‌ను అభినవ చాణక్య అని కవిత అభివర్ణించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సిఎం కెసిఆర్ అని స్పష్టం చేశారు. కెసిఆర్ ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి స్పూర్తినిచ్చారన్నారు.ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్‌పై ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని వ్యాఖ్యానించారు. తాము పని చేశామని, మూడో సారి ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని, ఖచ్చితంగా మళ్లీ కెసిఆరే సిఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో బిఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు.
తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక
తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని… అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని, సిఎం కెసిఆర్ అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపారని వివరించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కెసిఆర్‌తో సఫలం అయ్యిందని కవిత తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం సాగిందని, చివరికి 2001లో సిఎం కెసిఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కెసిఆర్ ఉద్యమాన్ని ఉదృతం చేయడంతో 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందని వివరించారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలు ఉండేవని, రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండేదని ప్రస్తావించారు. 2,700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేదని, విద్యుత్తు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారని స్పష్టం చేశారు. విద్యుత్తు మిగులు సాధించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరిందని అన్నారు.
జిఎస్‌డిపిలో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ
2014- 15 నుంచి 2022- 23 మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)118.2 శాతం పెరగగా…. తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి)155.7 శాతం పెరిగిందని కల్వకుంట్ల కవిత తెలిపారు. అంటే జాతీయ సగటుకు మించి తెలంగాణ పయనిస్తోందని చెప్పారు. జిఎస్‌డిపిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యే సమయానికి రూ. 1,12,162 ఉన్న తలసరి ఆదాయం 2022 -23 నాటికి రూ. 3,14,732కి పెరిగిందని, తలసరి ఆదాయం పెరుగుదలలో ఇతర రాష్ట్రాలకు మించి దూసుకెళ్తొందని చెప్పారు.సిఎం కెసిఆర్ అందరికీ సమాన సందప విధానాన్ని అవలంభిస్తున్నారన్నది అర్థమవుతోందని వివరించారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 2019 -21 ప్రకారం సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని ప్రస్తావించారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022 -23 నాటికి 15.7 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు.
వ్యవసాయం పండగలా మారింది
చివరిగింజ వరకు ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తోందని, రైతు బంధు పేరిట ఏటా ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రూ.72,815 కోట్లు అందించామని ఎంఎల్‌సి కవిత చెప్పారు. ఈ చర్య వల్ల రైతులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు చేసే పరిస్థితి పోయిందని అన్నారు. ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని, రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నామని వివరించారు. తెలంగాణ వ్యవసాయం పండగలా మారిందని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డులను కంప్యూటరీకరణ చేపట్టి విప్లవాత్మక మార్పుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. 99 శాతం భూరికార్డులు భద్రంగా ఉన్నాయని, తద్వారా అవసరమైన రుణాలను కూడా బ్యాంకులు ఇస్తున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మత్తు చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండుకుండాలా ఉన్నాయని, దానితో భూగర్భజలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద పెరిగిందని వివరించారు.
కాళేశ్వరం రైతులు మూడు పంటలు పండిస్తున్నారు
రికార్డుస్థాయిలో మూడున్నరేళ్ల కాలంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని కవిత పునరుద్ఘాటించారు. ఆ ప్రాజెక్టు వల్ల రైతులు మూడు పంటలు పండిస్తున్నారన్నారు. 2004 – 2014 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయానికి రూ. 7,994 కోట్లు ఖర్చు చేస్తే గత తొమ్మిదిన్నరేళ్లకాలంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. బలమైన విధానాలు రూపొందించడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాల నుంచి 2 కోట్లకుపైగా ఎకరాలకు పెరిగిందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని అన్నారు.
రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల 94 వేల కోట్లకు చేరుకుంది
2014లో రూ. 62 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ. 2 లక్షల 94 వేల కోట్లకు చేరుకుందని ఎంఎల్‌సి కవిత గుర్తు చేశారు. తాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లు ఖర్చు చేసిందని,మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కల్పించామని చెప్పారు. విద్యుత్తు రంగంలో రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని, 2014లో 7778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేదని, ఇప్పుడు 18453 మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకున్నామన్నారు. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలోనూ తెలంగాణ ఎంతో ముందుందని పేర్కొన్నారు. తలసరి విద్యుత్తు వినియోగం 2126 యూనిట్లకు చేరిందని, ఇది దేశంలోనే అత్యధికమని ప్రస్తావించారు. కాగా, పర్యావరణ సవాళ్లను అధిగమించడానికి 280 కోట్ల మొక్కలు నాటామని, అందుకు తెలంగాణకు హరితహారం కింద రూ.10 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. ప్రతీ గ్రామంలో నర్సరీని నెలకొల్పామని, ప్రపంచంలో ఈ విధానం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటును వేగవంతంగా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. టిఎస్ ఐపాస్ విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని, ఆలోగా అనుమతులు రాకపోతే పరిశ్రమను స్థాపించుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని వివరించారు. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22,100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, తద్వారా 22 లక్షల 36 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించామని, 2014లో రాష్ట్రం నుంచిరూ. 57 వేల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతి కాగా, ఇప్పుడు రూ.1.83 లక్షల విలువైన ఎగుమతులుకు చేరామని వివరించారు.
వైద్య రంగంలో తెలంగాణ ఎంతో పురోగమించింది
యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని కవిత అన్నారు. సిఎం కెసిఆర్ దూరదృష్టితోనే ఇంత వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే, వైద్య రంగంలో తెలంగాణ ఎంతో పురోగమించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, సిఎం కెసిఆర్ ఇప్పుడు 104 కేంద్రాలకు పెంచారన్నారు. రూ. 11 వేల కోట్లకుపైగా ఆసరా పథకం కింద 44 లక్షల మందికిపైగా పెన్షన్లు అందించామని పేర్కొన్నారు. విద్యారంగంలో రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. 10 వేల మెడికల్ సీట్లను పెంచామని, ప్రతీ జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల వారి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతకు ఎంతో కృషి చేస్తున్నమని అన్నారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిది
మహిళా రిజర్వేషన్ల చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు అని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత కూడా మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు కావడం లేదని కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించిందని అన్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచే చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, అన్ని పార్టీలు డిమాండ్ చేసినా ఒబిసి కోటా కూడా కల్పించలేదని కవిత తప్పుబట్టారు.

Kavitha Key Speech

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News