రైల్ రోకోకు లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
సిపిఎం, న్యూడెమోక్రసీ నేతలతో భేటీ
మద్దతు ప్రకటించిన వామపక్ష పార్టీలు
మనతెలంగాణ/హైదరాబాద్: బిసిలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతునివ్వాలని వామపక్ష పార్టీలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అడిక్ మెట్లోని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యాలయం మార్క్ భవన్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వర రావు, జేవీ చలపతి రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె. గోవర్ధన్తో ఎంఎల్సి కవిత వేర్వేరుగా భేటీ అయ్యారు.
బిసి రిజర్వేషన్ల పెంపు, కామారెడ్డి బిసి డిక్లరేషన్ అమలు కోసం తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏడాదిగా అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్వహించామన్నారు. తమతో పాటు బిసి సంఘాలు చేసిన ఆందోళనలకు దిగివచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్లో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు మరో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింపజేసిందన్నారు. ఈ బిల్లును కేంద్రానికి పంపి మూడు నెలలవుతున్నా అమలు చేయడానికి కేంద్రంపై సిఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఒత్తిడి చేయడం లేదన్నారు. అందుకే జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని.. ఈ ఆందోళనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ భవన్కు పంపిస్తాం
అధికారంలో ఉన్నామని ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో కాంగ్రెస్ తల్లి విగ్రహాలను ప్రతిష్టిస్తుందని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాలను గౌరవ మర్యాదలతో గాంధీ భవన్కు పంపిస్తామని ఎంఎల్సి కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రతీకగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేయడం సరికాదని.. అది కాంగ్రెస్ తల్లి అని తాము మొదటి నుంచి చెప్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం మార్చుతోన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజామోదం లేదని పేర్కొన్నారు.