Wednesday, May 29, 2024

ఈ నెల 10న ఎల్బీ స్టేడియంలో మోడీ భారీ బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ ః ఎన్నికల ప్రచార పర్వం నాలుగు రోజుల్లో ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రధానమంత్రి మోడీ నుంచి రాష్ట్ర నాయకుల వరకు హోరెత్తిస్తున్నారు. చివరిగా ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. కాగా ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ రాజ్ భవన్‌లో మంగళవారం రాత్రికి బస చేసి, బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో వేములవాడకు చేరుకుంటారు. ఉదయం 8 గంటలకు అక్కడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ పర్యటనలో ఉదయం 8:30 గంటలకు మోదీ వేములవాడ శివారులోని బాలానగర్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా గుడి చెరువు ప్రాంగణంలోనే హెలిప్యాడ్ సిద్ధం చేశారు. అనంతరం ఉదయం 10 గంటలకు వరంగల్‌లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. వరంగల్ సభ పూర్తి కాగానే అక్కడి నుంచి హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఏపీకి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు రాజంపేట బీజేపీ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 నుంచి 8 గంటలకు విజయవాడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొంటారు.

నేడు తెలంగాణకు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్
ఈ నెల 8 రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. మే 9న ఉదయం 9 గంటలకు భువనగిరి నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఇక కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం తెలంగాణలో పర్యటించనున్నారు. రాజ్ నాథ్ సింగ్ మే 9న హైదరాబాద్‌కు చేరుకుని ఉదయం 9 గంటలకు వరంగల్‌లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు . అనంతరం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని బాన్సువాడలో జరిగే బహిరంగ సభలోనూ రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారని బిజెపి వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News