Tuesday, June 3, 2025

జిహెచ్‌ఎంసిలో మాన్‌సూన్ ఎమర్జెన్సీ

- Advertisement -
- Advertisement -

ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లు రద్దు చేయాలి
అక్రమాలకు తావిస్తోన్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
సిఎం రేవంత్ రెడ్డికి ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేసి వార్డుల వారీగా మళ్లీ టెండర్లు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం సిఎం రేవంత్ రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. జిహెచ్‌ఎంసిలోని 150 డివిజిన్లలో మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్‌కు సంబంధించిన పనులు చేపట్టేందుకు పిలిచిన టెండర్లలో స్థానిక కాంట్రాక్టర్లకు నష్టం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ఈ పనులు చేపట్టేందుకు వినియోగించే వాహనాల్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉండాలనే నిబంధనలు పెట్టారని ఆ స్పెసిఫికేషన్స్ ఉన్న వాహనాలను విక్రయించే డీలర్లు హైదరాబాద్‌లో ఇద్దరే ఉన్నారని వివరించారు.

టెండర్లలో పాల్గొన్న స్థానిక కాంట్రాక్టర్లకు ఆయా డీలర్లు వాహనాలు సరఫరా చేసేందుకు సమ్మతి ఇవ్వకపోవడంతో వారు కర్ణాటక డీలర్ల నుంచి ఎంఒయు తీసుకొని టెండర్లలో పాల్గొన్నారని తెలిపారు. ఆ కాంట్రాక్టర్లు ఎంఒయుకు సంబంధించిన ఫిజికల్ కాపీలు సమర్పించడానికి జిహెచ్‌ఎంసిలోని కొందరు అధికారులు తగినంత సమయం ఇవ్వడం లేదని.. మెడపైకి కత్తి పెట్టి కొన్ని గంటల వ్యవధిలోనే కాపీలు సమర్పించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఫిజికల్ కాపీలు సమర్పించలేదనే సాకు చూపించి స్థానిక కాంట్రాక్టర్లను టెండర్లలో డిస్ క్వాలిఫై చేసి తాము ముందే ఒప్పందం కుదుర్చుకున్న రెండు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా కొందరు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారంలో ఉన్నదని తెలిపారు. ఈ పనుల కోసం గతంలో వినియోగించిన వాహనాల ద్వారా రెండు, మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే అవకాశం ఉండేదని, ఇప్పుడు జిహెచ్‌ఎంసి జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న స్పెసిఫికేషన్స్ ఒక విదేశీ కంపెనీకి చెందిన వాహనాలకు మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు.

ఆ వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదని మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. కేవలం ఆ కారణంతోనే ఒక ఏడాదికి గతంలో అయ్యే వ్యయం రూ.5.40 కోట్లు అయ్యే వ్యయం రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగి రూ.11.25 కోట్లకు చేరిందని, అంటే ఏటా రూ. 5.85 కోట్ల ప్రజాధనం అధనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి చూస్తున్నందున ఆ శాఖ పరిధిలోని జిహెచ్‌ఎంసి టెండర్లలో తెలంగాణ బిసి కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వెంటనే మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేసి గతంలో మాదిరిగా వార్డుల వారీగా మళ్లీ టెండర్లు పిలిస్తే 150 మంది కాంట్రాక్టర్లకు ఉపాధి కలుగుతుందన్నారు. దీనికి విరుద్ధంగా సిహెచ్‌ఎంసి జోన్‌ల వారీగా టెండర్లు పిలవడంతో తొమ్మిది టెండర్లు మాత్రమే దాఖలు చేసే అవకాశం లభించిందని, ఆ తొమ్మిది టెండర్లను కూడా రెండు సంస్థలకే కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసిలో టెండర్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగానికి ప్రయత్నిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News