Thursday, April 25, 2024

ఓయూలో ఆక్సిజన్ పార్కు ప్రారంభించిన ఎంపి సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

MP Santosh Kumar inaugurates Oxygen Park in OU

మనతెలంగాణ/హైదరాబాద్: పచ్చని వాతావరణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాలు సమీప ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎండిఎ సహకారంతో ఓయూలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్క్‌ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విసి, రిజిస్ట్రార్, ఓఎస్డీతో కలిసి ఆక్సిజన్ పార్కులో కలియ తిరిగారు. మోమిన్ చెరువు అభివృద్ధి, ఇతర మౌలిక వసతుల కల్పనపై ప్రొఫెసర్ రవీందర్… సంతోష్‌ కుమార్‌కు వివరించారు. సమగ్ర నివేదిక (డిపిఆర్)తో వస్తే ఆక్సిజన్ పార్క్ సహా ఉస్మానియా ఆవరణలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తానని ఈ సందర్భంగా విసికి సంతోష్‌కుమార్ హామీ ఇచ్చారు. 200 రకాల ఔషధ మొక్కలు, చెట్లతో ఆక్సిజన్ పార్క్‌ను అభివృద్ధి చేశామని రవీందర్ తెలిపారు. వెయ్యికి పైగా నెమళ్లు ఈ పార్క్‌లో ఉన్నాయని.. వాటి సంరక్షణతో పాటు బయో డైవర్సిటీకి ఓయూ కేంద్రంగా ఉందని స్పష్టం చేశారు. హెచ్‌ఎండిఎ కమిషనర్‌గా, ఓయూ ఇంఛార్జ్ ఉపకులపతిగా ఉన్న అరవింద్‌ కుమార్ కృషితో ఓయూలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారని.. ప్రస్తుతం ఓ అడవిని సృష్టించామని అన్నారు. వృక్ష మిత్ర ఎంపి సంతోష్‌కుమార్ చేతుల మీదుగా పార్క్‌ను విద్యార్థులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం సంతోషంగా ఉందని చెప్పారు. జీవజాతుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా పాదచారులను కొంత వరకు కట్టడి చేశామని… ఉదయం, సాయంత్రం మాత్రమే కొంత మేరకు అనుమతిస్తున్నాని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహకారంతో పచ్చని చెట్లతో ఉస్మానియా ప్రాంగణం ఆహ్లాదకరంగా మారిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంపి సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఓజోన్ డే సందర్భంగా ఓజోన్ పార్క్ వద్ద సంతోష్‌కుమార్, విసి రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్ మొక్కలు నాటారు.

MP Santosh Kumar inaugurates Oxygen Park in OU

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News