Saturday, April 27, 2024

సిఎం కెసిఆర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు: ఎంపి వద్దిరాజు రవిచంద్ర

- Advertisement -
- Advertisement -

MP Vaddiraju Ravichandra Comments on BRS

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)ని నెలకొల్పిన టిఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైన కేసీఆర్ దేశంలో ప్రస్తుతం నెలకొన్న అస్తవ్యస్త రాజకీయ, ఆర్థిక పరిస్థితిల పట్ల ఆవేదనతో బిఆర్ఎస్ ను నెలకొల్పి జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. విశేష రాజకీయ, పాలనానుభవం, దేశకాల పరిస్థితులపై సంపూర్ణ అవగాహన, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు, వక్తగా మంచి పేరున్న కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం సముచితమని వద్దిరాజు విశ్లేషించారు. టిఆర్ఎస్ ను స్థాపించి అహింసా మార్గంలో మహోద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మహానేత కేసీఆర్ అని ఎంపీ కొనియాడారు. సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేస్తూ, ప్రజలందరి భద్రత, సంక్షేమం, ఉన్నతికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్న కేసీఆర్ ను దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ప్రశంసిస్తున్నారన్నారు.

ఇక్కడ కొనసాగుతున్న అభివృద్ధిని చూసి సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ ప్రాంతాలు కూడా తెలంగాణలో విలీనమవుతే బాగుంటుందని పేర్కొన్న సందర్భాలను గుర్తు చేశారు. ఇటీవల 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు తెలంగాణలో పర్యటించి దండుగ అనుకున్న వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగ అని నిరూపించడాన్ని కళ్లారా చూసి.. దేశానికిప్పుడు ఇటువంటి మహానేత అవసరం ఎంతైనా ఉందని కితాబునిచ్చారన్నారు. దార్శనికులు కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని, అఖండ విజయాలు సాధిస్తుందన్న ఆశాభావాన్ని రవిచంద్ర వ్యక్తం చేశారు. కేంద్రంలో కేసీఆర్ మరెన్నో ప్రధాన పదవులు అధిరోహించి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతారని ఆకాంక్షించారు. కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను నిండు మనస్సుతో బలపర్చవలసిందిగా దేశ ప్రజలకు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News