Sunday, April 28, 2024

హరిత విప్లవ పితామహుడు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత ‘భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎంఎస్ స్వామినాథన్ (98) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు’. 1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధి వైపుకు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు. వ్యవసాయ రంగంలో వినూత్న విధానాలతో స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహనతో ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మిళితం చేశారు స్వామినాథన్. దీంతో ఎంతోమంది తక్కువ ఆదాయ రైతులు దేశాభివృద్ధికి గణనీయంగా తోడ్పాటునిచ్చారు. స్వామినాథన్ చేసిన సేవలకు గాను 1987లో మొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను అందుకున్నారు.

ఆ డబ్బుతో ఆయన చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 1971లో స్వామినాథన్‌కు రామన్ మెగసెసే అవార్డు, 1986లో అల్బర్ట్ ఐన్‌స్టీన్ సైన్స్ అవార్డ్‌లతో సత్కరించారు. భారత్‌లో చేసిన సేవల కంటే స్వామినాథన్ ప్రపంచ వేదికపై ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు ఆయన మేధస్సును అందించారు. టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 20 మంది ఆసియన్లలో ఒకరిగా ఆయనకు స్థానం దక్కింది. మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారత దేశంలో ‘హరిత విప్లవ పితామహుడు’ గా పేర్కొంటారు. అతను ‘ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ ను స్థాపించి దాని చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతను ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాడు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశాడు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారత దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించాడు.

1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరక్టరుగా పని చేసాడు. 1979 నుండి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. అతను అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుండి 1988 వరకు డైరక్టరు జనరల్‌గా సేవలనందించాడు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా ఉన్నాడు. 1999లో 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా ‘టైం 20’లో అతని పేరును టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించింది. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న కుంభకోణంలో జన్మించారు. పద్మశ్రీ (1967), రామన్ మెగసెసే (1971), పద్మభూషణ్ (1972), ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ (1986), పద్మవిభూషణ (1989), వరల్డ్ ఫుడ్ ప్రైజ్ (1987), టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ అఛీవ్‌మెంటు (1991), వోల్వో ఎన్వినాన్‌మెంటల్ ప్రైజ్ (1999), ఇందిరా గాంధీ శాంతి బహుమతి (1999), ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం (2013) వంటి పురస్కారాలు అందుకున్నారు. భూములకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించి,

యాంత్రీకరణను ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులను వాడి, సంకర జాతి వంగడాలతో స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని హరిత విప్లవం) అంటారు. ఇది తొలిసారి మెక్సికోలో 1945లో ప్రారంభమైంది. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ఈ విప్లవాన్ని ఇతర దేశాలను విస్తరించడానికి నిర్ణయించింది. అదే సమయంలో 1960లో భారత్ తీవ్ర కరవు పరిస్థితులు ఎదుర్కొంది. ఆ సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖకు సలహాదారుగా ఉన్న ఎంఎస్ స్వామినాథన్ మెక్సికో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్‌ను దేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వపరం గా ఇబ్బందులున్నప్పటికీ మెక్సికో ప్రయోగశాల నుంచి గోధుమను దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా పంజాబ్‌లో పండించారు. అవి మంచి దిగుబడి రావడంతో భారత్‌లో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది. దీంతో స్వామినాథన్‌ను భారత హరిత విప్లవ పితామహుడిగా అభివర్ణిస్తారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో స్వామినాథన్ విశేష కృషి చేశారు.

అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఒకరైన సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో 2019 నుంచి 2022 వరకు చీఫ్ సైంటిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆమె ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకె సాంబశివన్ సర్జన్. మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత స్వామినాథన్ కూడా తండ్రి బాటలోనే మెడికల్ స్కూల్లో చేరారు. కాని 1943లో బెంగాల్‌లో చోటుచేసుకున్న క్షామన్ని కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్యరంగం నుంచి తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగువేశారు. త్రివేండ్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీ నుంచి యుజి డిగ్రీ పట్టా పొందిన ఆయన.. ఆ తర్వాత మద్రాసు అగ్రికల్చరల్ కాలేజీలో చేరారు. అగ్రికల్చరల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ లో పిజి చదివారు. పిజి పూర్తయిన తర్వాత స్వామినాథన్ యుపిఎస్‌సి పరీక్ష రాసి ఐపిఎస్‌కు అర్హత సాధించారు.

కాని ఆ అవకాశాన్ని వదులుకుని యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్శిటీలో చేరారు. అక్కడ బంగాళదుంప జన్యుపరిణామంపై అధ్యయనం చేశారు. అక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో చేరి పిహెచ్‌డి పూర్తి చేశారు. కొంతకాలం అక్కడ పని చేసిన ఆయన 1954లో భారత్‌కు తిరిగొచ్చి ఐఎఆర్‌ఐ లో శాస్త్రవేత్తగా పరిశోధన కొనసాగించారు. 1972- 79 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ సెక్రటరీగా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వ్యవసాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News