ఐపిఎల్ సీజన్ 2025లో గుజరాత్ టైటాన్స్ పోరాటం ముగిసింది. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇక ఆదివారం జరిగే క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్తో ముంబై తలపడుతుంది.
రోహిత్ మెరుపులు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టోలు శుభారంభం అందించారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన బెయిర్స్టో 22 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 3 సిక్స్లు, ఒక ఫోర్తో 33 పరుగులు సాధించాడు. తిలక్వర్మ కూడా 11 బంతుల్లోనే 3 సిక్స్లతో 25 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య 9 బంతుల్లోనే అజేయంగా 22 పరుగులు సాధించాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో టి20 కెరీర్లో ఏడు వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.