పాట్నా: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని బక్సర్ జిల్లా నివాసి చందన్ గా పోలీసులు గుర్తించారు. హత్య కేసులో దోషిగా ఉన్న చందన్ చికిత్స కోసం పెరోల్ పై బయటకు వచ్చాడని.. గురువారం పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడని.. ఐసియూలో ఉన్న అతడిని కొందరు దుండగులు కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలోని ఐసియూలోకి ప్రవేశించి చందన్ పై కాల్పులు జరిపి పారిపోయిన ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచార అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు.
పాట్నా (సెంట్రల్) ఎస్పి దీక్ష మాట్లాడుతూ.. ఆసుపత్రి నుండి సేకరించిన సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని.. హంతకులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పి తెలిపారు. పాత శత్రుత్వమే హత్యకు కారణమై ఉండవచ్చని ఆమె తెలిపారు.