Saturday, July 27, 2024

నా పెళ్లాం కొడుతోంది..నాకు రక్షణ కావాలి

- Advertisement -
- Advertisement -

పోలీసులను ఆశ్రయించిన భర్త!
న్యాయం చేయాలని వేడుకోలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తన పెళ్లాం కొడుతోందని, తనకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్త ఉదంతమిది. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే… మల్లారెడ్డి కాలేజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న టెమూజియన్ కు తన భార్యకు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఇప్పుడు అది కాస్త ముదిరి భర్తను కొట్టే వరకు వెళ్లింది. ఇటీవల ఏకంగా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ప్రాణహాని ఉందంటూ అల్వాల్ పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని హైదర్ గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్, బాధితుడు టెమూజియన్ తనకు ఎదురైన సమస్యను వివరించాడు.

ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ తన గోడును మీడియాకు చెప్పుకున్నాడు. ఏపీలోని రాజోలుకు చెందిన టెమూజియన్ తనకు అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల కిందట వివాహం జరిగినట్లు వెల్లడించారు. మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా చేస్తున్న తను భార్యతో కలిసి అల్వాల్ లో నివాసం ఉంటున్నట్లు వివరించాడు. తమకు ఐదేళ్ల కొడుకు ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే పెళ్లైనప్పటి నుంచి భార్య తనను అకారణంగా హింసిస్తుందని వెల్లడించారు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ మాట్లాడిన ఆమె తీరు మారలేదని తెలిపాడు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేయగా, ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహ రిస్తున్నారని ఆరోపించాడు.

మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా? అని బాధితుడు టెమూజియన్ ప్రశ్నించారు. భార్య దాడి చేస్తుందన్న భయంతో, తాను శనివారం నుంచి ఇంటికి వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి, తనకు రక్షణ కల్పించాలని కోరాడు. తన తల్లిదండ్రులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు పత్రాలు తిరిగి వచ్చాయన్నారు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే కొన్ని గంటలకో, రోజుకో సర్దుకునేవి. కానీ ఈ మధ్య భార్యాభర్తల గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తు న్నాయి. కొందరు జంటలు మాత్రం విడాకులు తీసుకుంటున్నారు. దాంతో వారి పిల్లల మానసిక స్థితిపై తల్లిదండ్రుల విడాకులు ప్రభావం చూపుతాయని మానసిక నిపుణులు, పోలీసులు చెబుతున్నారు.

ట్రెండ్ మారిందా..!?

ట్రెండ్ మారిందా..!? పనిచేసే చోట ఎంతో ఒత్తిడి ఉన్నా, వాటిని అధిగమిస్తూ కుటుంబ బారాన్ని మోస్తున్న భర్తలపై కొందరు భార్యలు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో భార్యా బాధితుల సంఘాలు, బాధితులు పెరిగిపోతున్నారు. ఇటీవల ఓ జూనియర్ జడ్జి సైతం భార్య టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తాజాగా మరో వ్యక్తి తాను భార్యా బాధితుడ్ని ఆమె నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడంటే పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News