ప్రతి సంవత్సరం జూన్ 29న భారతదేశంలో జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది గణాంకాల ప్రాముఖ్యతను గుర్తు చేసే ఓ అరుదైన సాంప్రదాయం. ఈ రోజు భారత గణాంక శాస్త్ర పితామహుడు, ప్రముఖ శాస్త్రవేత్త, ఆర్థిక ప్రణాళికా మార్గదర్శకుడు అయిన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహాలనోబిస్ జయంతి. ఆయన సేవలను స్మరించుకునే కార్యక్రమాలే ఈ దినోత్సవానికి మూలం. గణాంక శాస్త్రాన్ని భారతదేశ అభివృద్ధికి ఒక సూత్రమైన సాధనంగా తీర్చిదిద్దిన మహాలనోబిస్ కృషికి ఇదే సరైన నివాళి. ప్రొఫెసర్ మహాలనోబిస్ 1893, జూన్ 29న కలకత్తాలో జన్మించారు. ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్రం అభ్యసించి, తరువాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య పొందారు. అక్కడే గణాంక శాస్త్రంపట్ల ఆయన ఆసక్తి పెరిగింది. తిరిగి భారతదేశానికి వచ్చిన తరువాత ఆయన స్థాపించిన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) దేశంలో గణాంక విద్య, పరిశోధనకు కేంద్రంగా మారింది.
వ్యవసాయ, ఉపాధి, జనాభా వంటి రంగాల్లో నమూనా సర్వేలు నిర్వహించి వాటి ఆధారంగా ప్రభుత్వ విధానాల రూపకల్పనకు మార్గదర్శకత్వం వహించారు. ఆయన అభివృద్ధి చేసిన మహాలనోబిస్ దూరం అనే గణాంక ప్రమాణం వర్గీకరణ, నమూనా గుర్తింపు వంటి అనేక సాంకేతిక రంగాల్లో ఉపయోగపడుతోంది. 1956లో ప్రారంభమైన ద్వితీయ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన రూపొందించిన మహాలనోబిస్ మోడల్ అనేది పారిశ్రామికాభివృద్ధికి ప్రాముఖ్యత నిచ్చే విధంగా రూపొందించబడింది. ఆయన సలహాలతో కేంద్ర గణాంక సంస్థ (సిఎస్ఒ) స్థాపించ బడింది, ఇది నేటి జాతీయ గణాంక కార్యాలయంగా పరిణమించింది. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1968లో పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానంచేసింది. జాతీయ గణాంక దినోత్సవం ద్వారా గణాంకాల సామర్థ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గణాంకం కేవలం గణనకోసం మాత్రమే కాక, ప్రభుత్వ పాలన, విధాన నిర్ణయాలలో విశ్వసనీయ ఆధారంగా నిలుస్తుంది. ఉదాహరణకు, 2023 నాటికి భారత్ జనాభా 142 కోట్లకు చేరింది.
ఈ జనాభా నిర్మాణాన్ని బట్టి వివిధ సందర్భాలలో విద్య, ఆరోగ్య సేవల కేటాయింపులు, ఉపాధి ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. అంతేకాక, పేదరిక స్థాయి గణాంకాల ప్రకారం 2011 -12 దేశంలో 21.9 శాతం మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారు. ఇటువంటి గణాంకాలు లేకుండా ఏ విధానం ప్రయోజనకరంగా ఉంటుందో అంచనా వేయడం అసాధ్యం. ఇప్పటి డేటా ఆధారిత ప్రపంచంలో గణాంక శాస్త్రం మరింత విస్తరించి, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో అనుసంధానమవుతోంది. బిగ్ డేటా విశ్లేషణలు, ఆన్లైన్ సర్వేలు, డిజిటల్ డేటా సమీకరణం వంటివి సమాజంలోని మార్పులను విశ్లేషించడానికి కీలకంగా మారాయి. ప్రభుత్వం పలు కీలక పథకాలను ఉదాహరణకు ఉజ్వల యోజన, ఆరోగ్య మిషన్ వంటి వాటిని గణాంక ఆధారంగా లక్ష్యంగా మలచగలిగింది. దీనివల్ల సమర్థవంతమైన సేవల అందుబాటు సాధ్యమైంది. ఈ సంస్థ అప్లయిడ్ స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎకనోమెట్రిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. యునెస్కో, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలకు ఐఎస్ఐ వితరణలూ, సూచనలూ ముఖ్యమవుతున్నాయి.
భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాలు గణాంక విద్యను అందిస్తున్నాయి. ఐఐటి, ఐఐఎస్సి, ఐఎస్ఐ వంటి సంస్థలలో గణాంకంలో అగ్రశ్రేణి విద్య, పరిశోధన జరుగుతోంది. డేటా అనాలిటిక్స్, ఆప్టిమైజేషన్ వంటి కోర్సులు ద్వారా యువతకు ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. గణాంకం + కంప్యూటర్ సైన్స్ అనేది ప్రస్తుత కాలంలో శక్తివంతమైన కలయికగా నిలుస్తోంది. 2025 సంవత్సరానికి ‘గణాంకాల ద్వారా సమగ్ర అభివృద్ధి’ అనే అంశం గణాంక దినోత్సవం థీమ్గా తీసుకోవడం, ప్రగతి సాధనలో గణాంకాల కీలకతను గుర్తించడంలో ఒక ముఖ్య సూచన. ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, స్త్రీ-పురుష సమానత్వం వంటి రంగాల్లో గణాంకాలు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ గణాంక దినోత్సవం ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. సమాజాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునే శక్తి గణాంకాల్లో ఉంది. ప్రతి డేటా సూత్రం ఒక పరిశోధనకు ద్వారం, ప్రతి విశ్లేషణ ఒకసమాజాన్ని మెరుగుపరచే అవకాశం. గణాంకాల మౌలికతను మనం గుర్తించినప్పుడే నిజమైన ప్రజాసంక్షేమ ప్రణాళికలు పుడతాయి. అలాంటి గణన దిశలో మహాలనోబిస్ లాంటి మహనీయులను స్మరించుకుంటూ నిజమైన గణాంక విజ్ఞానంతో ముందుకు సాగడం ఈ దినోత్సవ అసలైన శుభార్ధం.