Tuesday, April 30, 2024

దేశాన్ని పరిరక్షించేందుకు ఒక్కటయ్యాం

- Advertisement -
- Advertisement -

విపక్షాలను చూసి మోడీకి భయం పుట్టింది
11మంది సభ్యులతో సమన్వయ కమిటీ
ముంబయిలో తదుపరి సమావేశం ప్రధాని
అభ్యర్థిపై అప్పుడే స్పష్టత, మాకు ఆసక్తి లేదు :
ఎఐసిసి చీఫ్ మల్లిఖార్జున ఖర్గే స్పష్టీకరణ
ఇండియాను ఎదుర్కొనే ధైర్యం ఎన్‌డిఎకు
ఉందా? : బిజెపికి మమత సవాల్
అణిచివేతపై పోరాటానికి దిగాం : రాహుల్
బెంగళూరులో విపక్షాల భేటీలో కీలక
నిర్ణయాలు తక్షణం కులగణనకు తీర్మానం

బెంగళూరు: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎను ఉమ్మడిగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులో సమావేశమైన పలువురు ప్రతిపక్ష నేతలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ భేటీ లక్షమని పేర్కొన్నారు. మంగళవారం రెండో రోజు సమావేశంలో ప్రసంగించిన ప్రతిపక్ష నేతలంతా కూడా బిజెపి ప్రభుత్వ హయాంలో దేశ ప్రజాస్వామ్యంతో ఆటలాడుకుంటున్నారని, భారత దేశపు ఆలోచనను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం నిర్మాణాత్మకంగాజరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ సమావేశం ఫలితం దేశానికి మంచిదన్నారు. మమత ప్రసంగానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

అలాగే సమావేశంలో ప్రసంగించిన పలువురు ప్రతిపక్ష నేతల వీడియోలను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. పదేళ్ల పాటు దేశాన్ని పాలించే అవకాశం ప్రధాని మోడీకి లభించిందని, అయితే ఆయన దాదాపు అన్ని రంగాలను పూర్తిగా గందరగోళంలో పడేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.‘ ప్రజల మధ్య విద్వేషాగ్నికి ఆయన ఆజ్యం పోశారు. దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంతగా గరిష స్థాయికి చేరుకుంది. అన్ని రంగాల్లోను నిరుద్యోగం పెరిగిపోయింది. దేశ ప్రజలు ఆయనను వదిలించుకోవలసిన సమయం వచ్చింది. అందుకే భావస్వామ్యం కలిగిన అన్ని పక్షాలు ఒక్కతాటి పైకి వస్తున్నాయి’ అని కేజ్రీవాల్ అన్నారు.‘

దేశాన్ని ,ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే పేదలు, యువకులు, రైతులు, మైనార్టీలకు రక్షణ కల్పించాలి. నరేంద్ర మోడీ పాలనలో ప్రతి ఒక్కరూ అణచివేయబడుతున్నారు’ అని ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. భారత దేశం అంటే ఏమిటో మనందరికీ తెలుసునని, భారత దేశాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది కాబట్టే ఈ సమావేశం చాలా ముఖ్యమైనదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.‘ దేశం అన్ని కోణాలనుంచి తీవ్రమైన దాడిని ఎదుర్కొంటోంది. మెరుగైన మార్పు తీసుకు రావడం కోసం ఈ దేశాన్ని కాపాడుకోవాలి’ అని ఏచూరి అన్నారు. బిజెపి ప్రభుత్వం దేశంలో సృష్టించిన పరిస్థితి దృష్టా మంగళవారం సమావేశం చాలా ముఖ్యమైందని జార్ఖండ్ ముఖ్యమంత్రి, జెఎంఎం నేత హేమంత్ సోరేన్ అన్నారు.

దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది బిజెపికి వ్యతిరేకంగా ఉన్నారని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, సోదరభావాన్ని కాపాడడానికి మనమంతా ఒకటి కావాలి. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ దుర్వినియోగం చేయడం జరుగుతోంది. దేశ సంపదను అమ్మేస్తున్నారు’ అని ఆర్‌జెడి నేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్ అన్నారు. ‘సామాన్యులు, రైతులు, యవతకు సంబంధించిన సమస్యలను పట్టించుకోవడం లేదు. విద్వేషం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు’ అని ఆయన అన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పాలనలో రాజ్యాంగాన్ని తుడిచి పెట్టేస్తున్నారని, దేశ లౌకిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. తప్పు జరుగుతున్న ప్రతిదానిపైనా మనమంతా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరముందని అన్నారు, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యంతో ఆటలాడుకుంటున్నారని పిడిఎఫ్ నేత మెహబూబా ముఫ్తీ అన్నారు. ‘బ్రిటీష్ వాళ్లు దేశాన్ని విభజించి పాలించారు. ఈ రోజు బిజెపి దేశాన్ని విభజిస్తూ నాశనం చేస్తోంది. బిజెపినుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది’ అని ఐయుఎంఎల్ అధ్యక్షుడు కెఎం కాదిర్ మొహియుద్దీన్ మండిపడ్డారు. 2024 ఎన్నికలు దేశాన్ని కాపాడడడానికిఓ పెద్ద ప్రజా ఉద్యమం అవుతుందని సిపిఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News