Friday, April 26, 2024

క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘భారత ప్రజాస్వామ్యం ముప్పులో ఉంది’ అన్నందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం డిమాండ్ చేసింది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేడు ఆరంభం కాగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘రాహుల్ గాంధీ ఈ సభ సభ్యుడు, ఆయన లండన్‌లో భారత్‌ను అవమానించారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండనీయమని నేను భావిస్తున్నాను, ఈ సభలోని వారందరూ ఆయనను క్షమాపణ చెప్పాలని కోరాలి’ అన్నారు.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుల మైక్రోఫోన్లను స్పీకర్ పనిచేయకుండా ఆపేస్తున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం’ అన్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అనేకసార్లు అవకాశం ఇచ్చారు. ఆయన మైక్రోఫోన్లను ఎప్పుడూ ఆపేయలేదు. ‘2013లో సభలో ఓ ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చింపేశారు, ఆ సమయంలో ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్లు?’ అని నిలదీశారు. కాగా బిజెపి సభ్యులు సభ వెల్‌లోకి ప్రవేశించి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ గగ్గోలు పెట్టారు. రణగొణుల మధ్య స్పీకర్ ఓమ్ బిర్లా సభను మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాయిదా వేశారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ప్రసంగిస్తూ భారత ప్రజాస్వామ్యం ముప్పులో ఉందన్నారు. తనతో సహా అనేక మంది నాయకులు నిఘాలో ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలావుండగా ప్రతిపక్ష సభ్యులు కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ సంక్షోభంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News