Friday, May 17, 2024

రాహుల్‌ను ప్రధానిగా చూడాలని పాక్ తహతహ

- Advertisement -
- Advertisement -

గుజరాత్: కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ భక్తురాలిగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ తదుపరి ప్రధానమంత్రిగా యువరాజు(రాహుల్ గాంధీ)ను కూర్చోపెట్టాలని దాయాది దేశం తఁహతహలాడుతోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చౌదరి ఫావద్ హుస్సేన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ పోస్టు పెట్టిన నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇక్కడ చస్తోందని పాకిస్తాన్ అక్కడ ఏడుస్తోంది. కాంగ్రెస్ కోసం పాకిస్తానీ నాయకులు ప్రార్థనలు చేస్తున్నారు.

తదుపరి ప్రధాన మంత్రిగా యువరాజును చూడాలని పాకిస్తాన్ తహతహలాడుతోంది. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ భక్తురాలని మనందరికీ ఇప్పటికే తెలుసు. కాంగ్రెస్, పాకిస్తాన్ మధ్య ఉన్న భాగస్వామ్యం ఇప్పుడు బట్టబయలైంది. భారత్‌లో బలమైన ప్రభుత్వం కాక బలహీన ప్రభుత్వం ఉండాలని శత్రువులు కోరుకుంటున్నారు అంటూ మోడీ విరుచుకుపడ్డారు. మధ్య గుజరాత్‌లోని ఆనంద్ పట్టణంలో మోడీ ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఓటు జిహాద్ పేరిట కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ బంధువు మరియా ఆలం ఇచ్చిన పిలుపుపై మండిపడ్డారు.

ఇప్పుడు ఇండియా కూటమి ఓట్ జిహాద్ అని పిలుపునిస్తోందని, ఇప్పటి వరకు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అని మాత్రమే విన్నామని మోడీ అన్నారు. మద్రాసాలో చదువుకున్న ఒక విద్యావంతులైన ముస్లిం కుటంబానికి చెందిన వ్యక్తి నుంచి ఈ ఓట్ జిహాద్ పిలుపు వచ్చిందని, జిహాద్ అంటే అర్థమేమిటో మీ అందరికీ తెలుసునని, ఇది ప్రజాస్వామ్యానికే అవమానమని ఆయన అన్నారు. దీన్ని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఖండించలేదని ఆయన చెప్పారు. ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందిన రిజర్వేషన్లను ముస్లింలకు అప్పగించడానికి దేశ రాజ్యాంగాన్ని మార్చివేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News