Monday, April 29, 2024

శ్రీశైలం రిజర్వాయర్ వల్లే పాలమూరు-రంగారెడ్డి పథకం సక్సెస్: మంత్రి నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  శ్రీశైలం రిజర్వాయర్ నీటి అధారంగా నిర్మాణం చేపట్టడం వల్లనే పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం విజయవంతం అయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి పథకం పట్ల ప్రతిపక్ష పార్టీలనుంచి వస్తున్న విమర్శలపట్ల శనివారం మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, ఈ పథకం పట్ల ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలనుంచి విషప్రచారం తగదని సూచించారు. ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద దానికింది ఆయకట్టు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయన్నారు.

దీనిని గమనించి ముఖ్యమంత్రి కెసిఆర్ 216 టీఎంసీల సామర్ద్యంగల శ్రీశైలం ప్రాజెక్టు నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నారని తెలిపారు. వాళ్లు ముందు జూరాల నుండి మొదలుపెట్టాలి అని వాదించారని, వాళ్లు తర్వాత అటవీ ప్రాంతం అని ఫిర్యాదులు పెట్టారని, తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది అని గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదులు చేశారని, తర్వాత రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, అనంతరం రైతుల పేరు మీద కేసులు వేయించారన్నారు. అన్ని విజ్ఞాలను దాటుకుని ప్రాజెక్టులో మొదటి పంపు ప్రారంభించగానే ఇప్పుడు ఒక పంపుతో ఎలా మొదలు పెడతారని కొత్త రాగం ఎత్తుకున్నారని ఆరోపించారు. జూరాల కింద ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 32 గ్రామాలు, 85 వేల ఎకరాల సేకరణ జరగాల్సివుందన్నారు. రీడిజైన్ చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేవలం 27 వేల ఎకరాల భూసేకరణ, 3 పెద్ద గ్రామాలు, 8 చిన్నతండాలు మాత్రమే భూసేకరణ , పునరావాసకార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.

తక్కువ నీటి ముంపుతో ఎక్కువ ప్రయోజనం మీద సిఎం కెసిఆర్ దృష్టిపెట్టారని తెలిపారు. కృష్ణా నదిలో ఎక్కువ నీటి లభ్యత ఉన్నది తుంగభద్ర బేసిన్‌లోనే అని అందువల్లే శ్రీశైలం రిజర్వాయర నీటి ఆధారంగా పాలమూరు రంగారెడ్డి పథకం చేపట్టడం మూలంగా ఈ నీరు కూడా అందుబాటులో ఉంటుందని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల మీద వీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవన్నారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అని హెచ్చరించారు. వీరికి పాలమూరుకు నీళ్లు రావాలి, ప్రజలు, రైతులు, ప్రాంతం బాగుపడాలి అన్నదానికన్నా ప్రాజెక్టు విఫలం కావాలి అన్న ఆకాంక్ష ఎక్కువగా ఉన్నదని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏవయినా అవరోధాలు వస్తే నీళ్లొస్తే బాగుపడతారు అని ప్రజలను జాగృతం చేసి సహకరించాలని, లోపాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.

తెలంగాణ ఎత్తిపోతల పథకాలు అన్నీ ప్రభుత్వ సలహాదారు పెంటా రెడ్డి నేతృత్వంలో  నడుస్తున్నాయని వివరించారు. పెంటా రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు 250 కి పైగా మోటార్లు బిగించబడ్డాయన్నారు.ఇతర దేశాల నుండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారని తెలిపారు. కానీ సుధీర్ఘ అనుభవం ఉన్న ఇంజనీరు, తెలంగాణ గర్వించదగిన ఇంజనీరు అయిన పెంటారెడ్డి మీద కూడా వీరు బురదజల్లుతున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క పంపునే ప్రారంభించారన్న ప్రాథమిక విషయం ఇప్పుడు విషం చిమ్ముతున్న నాయకులు విస్మరించడం గమనార్హం అన్నారు. మిగతా కల్వకుర్తి ఎత్తిపోతల పంపులన్నీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలోనే పూర్తి చేసుకున్నామని తెలిపారు. 60 ఏళ్లలో నష్టపోయిన పాలమూరు జిల్లా కేసీఆర్ నాయకత్వంలో నిలదొక్కుకుంటున్నదని తెలిపారు. పాలమూరుకు నీళ్లొస్తే వారి రాజకీయ జీవితాలు శాశ్వతంగా ఎక్కడ కూలిపోతాయోనని ప్రతిపక్ష పార్టీల నేతలు విషప్రచారం చేస్తున్నారని ఒక రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News