Friday, April 26, 2024

గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ చైర్మన్‌గా పల్లె రవి కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా పల్లె రవికుమార్ గౌడ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో రవికుమార్ రెండేళ్ళ పాటు కొనసాగనున్నారు. కాగా జర్నలిస్ట్ నేపథ్యం ఉన్న పల్లె రవికుమార్ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బొడంగిపర్తి గ్రామానికి చెందినవారు.

ఆయన 1972 ఏప్రిల్‌లో జన్మించారు. తండ్రి పల్లె లింగయ్య సిపిఐ నుంచి సర్పంచిగా పనిచేశారు. భార్య పల్లె కళ్యాణి గౌడ్ చందూరు ఎంపిపిగా కొనసాగుతున్నారు. చెందిన వ్యక్తి కాగా ఆ నియోజకవర్గం ఉప ఎన్నిక సమయంలో ఆయన బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బిసి సామాజికవర్గానికి చెందిన పల్లె రవికుమార్ బిఎస్‌సి, ఎంసిజె చదివారు. కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పల్లె రవికుమార్ విద్యార్థి దశలోనే మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ సమస్య, నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు.

1996లో జర్నలిస్ట్‌గా తన కేరీర్‌ను ప్రారంభించారు రవికుమార్. వివిధ ప్రముఖ దినపత్రికల్లో పనిచేశారు. 2006లో చందూరు వేదికగా వేలాది మందితో భారీ బహిరంగసభను తలపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. ఈ సభకు ముఖ్యనేతలు గద్దర్, పిజెఆర్, మధుయాష్కి గౌడ్, చెరుకు సుధాకర్, లక్ష్మణ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉజ్జయిని రత్నాకర్ హాజరయ్యారు. ఈ వేదిక సాక్షిగా ఫ్లోరైడ్ రక్కసిపై పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై తన వాణి వినిపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రంలోని జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకురావడంలో క్రియాశీలక పాత్రను పోషించారు. ప్రస్తుతం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పీపుల్స్ ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News