కేంద్రానికి కాంగ్రెస్ డిమాండ్ తీవ్రతరం
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇటీవల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సిడిఎస్) అనిల్ చౌహాన్ మన సైనిక చర్యలపై కొన్ని విషయాలను ప్రస్తావించారు. మనం యుద్ధ విమానాలను పోగొట్టుకోవల్సి వచ్చిందని అంగీకరించారు. ఈ దశలో ఇక జాప్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ సెషన్ కు పిలుపు ఇవ్వాల్సి ఉంది. దేశ సైనిక, విదేశాంగ పాలసీ వ్యూహాలపై పార్లమెంట్ ద్వారా జాతికి సరైన వివరణ ఇచ్చుకోవల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆదివారం డిమాండ్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ వాస్తవాలు జాతికి తెలియాల్సి ఉంది. భిన్న కథనాలతో ప్రజలలో గందరగోళానికి దారితీస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు మన దేశ రక్షణ సన్నద్ధత, మన వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలకు తెలియాల్సి ఉంది. ఇందుకు పార్లమెంట్ సెషన్ అత్యవసరం అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్షాలను ఈ కీలక విషయాలలో పరిగణనలోకి తీసుకుని వ్యవహరించడం మేలని హితవు పలికారు. జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్లో ఓ ఇంటర్వూలో పేర్కొన్న విషయాలు రక్షణ విషయంలో మన వైఫల్యాలను చాటుతున్నాయని రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భద్రత విషయాలలో దాపరికాలతో ఇకపై పరిస్థితి మరింత దిగజారుతుందని , ఈ విషయం కేంద్రం గుర్తించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.