Thursday, April 25, 2024

హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పర్వతగిరి: హత్య కేసును యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించిన ముగ్గురు నిందితులను పర్వతగిరి పోలీసులు అరెస్టు చేసినట్లు మామునూరు ఏసీపీ కృపాకర్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ.. గత నాలుగు రోజుల క్రితం ముంజాలకుంటతండా శివారులో జాటోతు శ్రీను అనే వ్యక్తికి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయాడని పర్వతగిరి పోలీసులకు సమాచారం అందుకున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టగా అప్పగికే అక్కడికి చేరుకున్న సుమారు 100 మంది ముంజలకుంట, దాని చుట్టుపక్క తండాల గ్రామస్థులు ఆ సంఘటన యాక్సిడెంట్ అని సమీపంలోని నిర్మల ఇన్‌ఫ్రా ప్రాజెక్టు క్రషర్‌కు సంబంధించిన ట్రాక్టర్ అటువైపుగా కొద్దిసేపటి క్రితం అతివేగంగా వెళ్లిందని చెప్పగా ఆ దిశగా విచారణ చేస్తుండగా ఆ గ్రామస్థులు విచారణకు పోలీసు వారికి సహకరించకుండా ఆ మృతదేహాన్ని తీసుకొని వెళ్లి క్రషర్ ముందు ఉంచి న్యూసెన్స్ చేశారు.

వెంటనే పోలీసు సిబ్బందిని పిలిపించుకొని వారందరికీ గ్రామస్థులకు సర్దిచెప్పి ఉదయాన్నే మృతదేహాన్ని ఎంజీఎం మార్చూరీకి తరలించారు. ఆ తరువాత విచారణలో భాగంగా మెడికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్ నిశితంగా పరిశీలించి నిందితులను తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతుడు జాటోతు శ్రీనుకు భార్య శాంతి, బిడ్డ, కొడుకులు ఉన్నారు. శ్రీనుకు గత ఐదారు సంవత్సరాల క్రితం పాముకాటుకు గురవగా అప్పుడు నాటు వైద్యం సరైన చికిత్స చేయకపోవడం వల్ల గాయం పెద్దదై పుండుగా మారి ఇంట్లో వారందరికీ ఇబ్బందికరంగా మారింది. దానితోపాటు మృతునికి బాగా తాగుడు అలవాటు వల్ల రోజు తాగి వచ్చి భార్య, పిల్లలను ఇబ్బందులు పెట్టేవాడు. ఈక్రమంలో ఎలాగైనా ఈ తాగుబోతును వదిలించుకోవాలని ఆలోచించిన భార్య శాంతి, తన కూతురు ప్లాన్ చేసి కూతురు స్నేహితుడైన పులిగుజ్జు విష్ణుతో కలిసి జాటోతు శ్రీనును చంపాలని ప్లాన్‌చేసి ఫిబ్రవరిలోనే కాలువలో పడేసి చంపుదామనుకున్నారు.

కాని ధైర్యం సరిపోక విరమించుకున్నారు. తరువాత మార్చి 30న ఎలాగైనా చంపాలని తన తల్లితో కలిసి నిర్ణయించుకొని ప్రతీ రోజు సాయంత్రం శ్రీను ముంజలకొండతండా దగ్గర్లో గత నర్రంగతండా వెళ్లి సారా తాగి వస్తాడు. ఆ రోజు కూడా తను సారాకు వెళ్లగా విషయం కూతురు తన స్నేహితుడికి ఫోన్‌చేసి చెప్పగా అతను అప్పటికే క్రషర్ పనిపై ట్రాక్టర్ తీసుకొని పర్వతగిరి వచ్చి వెంటనే మళ్లీ తిరిగి క్రషర్‌కు వెళ్లి క్రషర్ నుంచి బయటకు వచ్చి మృతుని రాకను గమనిస్తున్నాడు, ఈ క్రమంలో మృతుడు తండా నుంచి నడిచి తన ముంజులకుంటతండాకు వెళ్తున్న క్రమంలో విష్ణు తన బండిపై వచ్చి బండి పక్కన ఆపి మృతునితో మాట్లాడుతున్న క్రమంలో కింద పడేసి మృతుని తలను కంకర బండలతో బలంగా మోది చంపాడు.

వెంటనే అక్కడి నుంచి క్రషర్‌కు వెళ్లి తన స్నేహితుడికి, మృతురాలి కూతురికి విషయం చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ విషయం తెలియని గ్రామస్థులు అంతకుముందు వెళ్లిన ట్రాక్టర్ శ్రీనును ఢీకొని ఉండవచ్చని ఆరోపణలతో క్రషర్ ముందు న్యూసెన్స్ చేశారు. కాని పోలీసుల విచారణలో ఈ ముగ్గురు నిందితులు తమ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఇందులో ఏ1 పులిగుజ్జు విష్ణు, ఏ2 మైనర్, ఏ3 జాటోతు శాంతిలను బుధవారం మామునూరు ఏసీపీ కృపాకర్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్, ఎస్సై దేవేందర్, సిబ్బంది రాజు, మహేందర్‌లను ఏసీపీ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News