Sunday, April 28, 2024

అనాధ చిన్నారులందరికీ ‘పీఎం కేర్స్‌ఫండ్ ’ సహాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తల్లిదండ్రులను ఎటువంటి పరిస్థితుల్లో కోల్పోయినప్పటికీ అనాథలు, అనాథలేనని , కొవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకున్నట్టు గానే దేశం లోని అనాథ బాలలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు తెలియజేసింది. పీఎం కేర్స్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం , విద్యాహక్కు చట్టం లోని సెక్షన్2 (డి) ద్వారా విద్యావకాశాలు కల్పించడం వంటి మంచి విధానాలను కొవిడ్ బాధితుల కోసం కేంద్రం తీసుకువచ్చిందని గుర్తు చేసింది. అటువంటి చేయూతను దేశం లోని అనాథ చిన్నారులు అందరికీ వర్తింప జేసే విషయాన్ని పరిశీలించాలని సూచించింది.

దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ విక్రంజీత్ బెనర్జీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం ఆదేశించింది. ఈ ధర్మాసనంలో జసన్టిస్ జెబి పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని కోర్టుకు తెలపడానికి నాలుగు వారాల సమయం ఇవ్వాల్సిందిగా అదనపు సొలిసిటర్ జనరల్ అభ్యర్థించారు.

అందుకు అంగీకరించిన ధర్మాసనం , సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంది. విద్యాహక్కు చట్టం కింద అనాథ చిన్నారులకు విద్యావకాశాలను కల్పించే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ స్పందనలను తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. కొవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి కల్పించిన ప్రభుత్వ పథకాల సదుపాయాలను అనాథలకు కూడా వర్తింప చేయాలని కోరుతూ పి.పి శుక్లా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News