Tuesday, April 30, 2024

మానవత్వం, టీమ్‌వర్క్‌కు అద్భుత నిదర్శనం.. ప్రధాని మోడీ ట్వీట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుపడిన కార్మికులను కాపాడడానికి సహాయక బృందాలు చేసిన కృషిని ప్రధానినరేంద్ర మోడీ అభినందించారు. ‘ఉత్తరకాశిలో మన సోదరులు చేపట్టిన రెస్కూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది. మీ ధైర్యం, ఓపిక ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని టన్నెల్‌లో చిక్కుపడిన సోదరులకు చెప్పదలచుకున్నా. అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ‘ఎక్స్’లో ఉంచిన పోస్టులో ప్రధాని అన్నారు.దీర్ఘకాలం వేచి ఉన్న తర్వాత ఈ సోదరులు ఇప్పుడు తమ ఆప్తులను కలుసుకోవడం గొప్ప సంతృప్తినిస్తోంది.

ఈ సంక్షుభిత సమయంలో ఆ కుటుంబాలన్నీ ప్రదర్శించిన సహనం, ధైర్యాన్ని ఎంత పొగిడినా తక్కువేనని కూడా ప్రధాని అన్నారు.కాగా ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికలుందరినీ క్షేమంగా కాపాడిన విషయం తెలిసి తనకు ఎంతో సంతోషం, ఊరట కలిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో ఉంచిన ఓ పోస్టులో పేర్కొన్నారు. ఉత్తర కాశీలోని సొరంగంలో చిక్కుపడిన 41 మంది శ్రామిక సోదరులను క్షేమంగా, భద్రంగా బయటికి తీసుకు రావడం దేశప్రజలందరికీ గొప్ప వార్త అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కార్మికులందరినీ క్షేమంగా బయటికి తీసుకు రావడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News