పహల్గాం దారుణానికి ప్రతీకారంగా ఉగ్రశిబిరాలను ధ్వంసం చేస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చానని, దానిని నెరవేర్చాకే ఇప్పుడు తిరిగి బీహార్ వచ్చినట్టు ప్రధాని మోడీ తెలిపారు. నాడు ఉగ్రవాదులను ఊహించని విధంగా శిక్షిస్తానని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శుక్రవారం ఆ రాష్ట్రం లోని కరకట్లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. “ రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చి తీరుతాం. ఇదే సరికొత్త భారత్ విధానం. పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. మన అమాయక ప్రజలు హత్యకు గురయ్యారు. ఒకరోజు తర్వాత నేను బీహార్( ఏప్రిల్ 24న ) పర్యటనకు వచ్చాను. పాక్ లోని ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేస్తానని, ఈ గడ్డపై నుంచి దేశానికి హామీ ఇచ్చాను. నా వాగ్దానాన్ని నెరవేర్చాకే ఇప్పుడు బీహార్లో అడుగుపెట్టాను.
పాకిస్థాన్ మన మహిళల సిందూరం శక్తిని చవిచూసింది. పాక్ ఆర్మీ నీడలో తాము సురక్షితంగా ఉంటామని ఉగ్రవాదులు భావించారు. మనం ఆ దేశ సైన్యాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టాం. మనం వారి ఎయిర్బేస్లను మిలిటరీ స్థావరాలను నిమిషాల్లోనే ధ్వంసం చేశాం. ఆపరేషన్ సిందూర్ మన అమ్ముల పొదిలో కేవలం ఒక బాణం మాత్రమే అని పాక్ తెలుసుకోవాలి. ఉగ్రవాదంపై మన యుద్ధం ముగియలేదు. నెమ్మదించలేదు. మరోసారి ఉగ్రదాడి జరిగితే, ఈ సారి ఆ పాము తలే ధ్వంసం అవుతుంది ” అని ప్రధాని మోడీ వెల్లడించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఆయన నిన్న పట్నాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం వెనక్కి తగ్గదు, బీహార్లో అభివృద్ధి ఆగదు అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది బీహార్అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.