Sunday, April 28, 2024

సిమ్ డీలర్లకు ఇక పోలీసు వెరిఫికేషన్

- Advertisement -
- Advertisement -

సిమ్ డీలర్లకు ఇక పోలీసు వెరిఫికేషన్
బల్క్ సిమ్‌కార్డులపైనా ఆంక్షలు
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
మోసపూరిత నేరాల కట్టడికి కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: సైబర్ నేరాలు, మోసపూరిత కాల్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డులు విక్రయించే డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో(బల్క్) సిమ్‌కార్డు కనెక్షన్లు ఇవ్వడంపైన కూడా ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు.‘ ప్రస్తుతం కొందరు సిమ్‌డీలర్లు అక్రమ పద్ధతుల్లో వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్‌కార్డులను విక్రయిస్తున్నారు.

ఇకపై అలాంటివి ఉండవు. సిమ్ కార్డు డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేస్తున్నాం. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవలసి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధించనున్నాం’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10లక్షల మంది సిమ్ డీలర్లు ఉన్నారని, వారంతా పోలీసు వెరిఫికేషన్ పూర్తి చేసుకునేందుకు తగిన సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటుగా బల్క్ కనెక్షన్ నిబంధనను కూడా తొలగించనున్నట్లు మంత్రి తెలిపారు.దాని స్థానంలో బిజినెస్ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు.

‘ఈ మధ్య మోసగాళ్లు అయిదు సిమ్‌లను తీసుకుని వాటిని ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత వాటిని డీ యాక్టివేట్ చేసి మరో బ్యాచ్ సిమ్‌లను తీసుకుంటున్నారు. ఈ తరహా నేరాలను అధ్యయనం చేసిన తర్వాత బల్క్ కనెక్షన్ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించాం’ అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇకపై బిజినెస్ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇందులో వ్యక్తిగత కెవైసి తప్పనిసరని స్పష్టం చేశారు.‘ ఉదాహరణకు ఒక కంపెనీ 4 వేల సిమ్‌కార్డులను తీసుకున్నదనుకోండి. గతంలో కంపెనీ కెవైసిని మాత్రమే వెరిఫై చేసి ఈ సిమ్‌లను ఇచ్చే వారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ నాలుగు వేల ఉద్యోగులను కెవైసి చేసిన తర్వాత మాత్రమే సిమ్‌కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది’ అని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 52లక్షల మొబైల్ కలెక్షన్లు తొలగించామని మంత్రి చెప్పారు. మోసాలకు పాల్పడుతున్న 57 వేల మంది డీలర్లను బ్లాక్ చేశామని,300 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశామని చెప్పారు.66 వేలకు పైగా మోసపూరిత వాట్సాప్ ఖాతాలను కూడా బ్లాక్ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News