Sunday, June 22, 2025

పొలిటికల్ ట్యాపింగ్‌లో అధికార గణం!

- Advertisement -
- Advertisement -

అత్యధిక ప్రజామోదంతో అధికారం చేపట్టిన రాజకీయ పక్షాలు కూడా తమ ఇష్టానుసారంగా రాజ్యం చేయలేవు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కొంతమందికి అవేమీ గుర్తు రావు, మేము ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో వరుసగా రెండుసార్లు ప్రజామోదం పొంది అధికారంలోకి వచ్చి మూడవసారి ఓటమి చవిచూసి ప్రతిపక్షంలో కూర్చున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధినాయకత్వం అట్లాగే ఆలోచించిందని జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అర్థం అవుతుంది. సరే ప్రభుత్వాలు మారగానే ఆ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో చేసిన పనుల్లో జరిగిన అవకతవకలు, అక్రమాల మీద దర్యాప్తులు జరగడం, కేసులు రావడం అనేది ఇటీవల కాలంలో చాలా సాధారణమైపోవడం మనకు తెలిసిందే.

అటువంటి ఒకానొక అక్రమ చర్య భారత రాష్ట్ర సమితి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించి ఓడిపోయేదాకా కొనసాగించింది అని ఆరోపణలు వచ్చాయి. దానిమీద ప్రస్తుత ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతున్న విచారణలో నిర్ఘాంతపరిచే వాస్తవాలు అనేకం బయటకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ పోరాటం జరిపి లక్ష్యాన్ని సాధించుకుని వరుసగా తొలి పదేళ్లు అధికారంలో ప్రజామోదంతో కొనసాగిన భారత రాష్ట్ర సమితికి తలవంపులు తెచ్చే వ్యవహారం ఇది. 2018లో రెండవసారి అత్యధిక మెజారిటీ సాధించి 119 స్థానాలకు గాను 81 స్థానాలు గెలుచుకొని రెండవసారి అధికారం చేపట్టాక రాష్ట్రంలో మళ్లీ 2023లో ఎన్నికలు జరిగే వరకు దాదాపు 600 మందిపైన ప్రభుత్వ నిఘా కొనసాగిందని అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.రాష్ట్రంలో నేరాలని పరిశోధించడానికి, అసలు నేరాలే జరగకుండా చూడటానికి,

వాటిని అరికట్టడానికి, శాంతిభద్రతలను పరిరక్షించడానికి ఉద్దేశించి పని చేయవలసిన పోలీస్ వ్యవస్థను అధికారపక్షం తన ప్రత్యర్థుల కదలికలు, వారు జరిపే సంభాషణలు తెలుసుకోవడం కోసం దుర్వినియోగపరిచిందని ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతున్న విచారణలో బయటపడుతున్నది.1885 భారత టెలిగ్రాఫిక్ చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం ఒక అనుమానిత వ్యక్తి టెలిఫోన్ సంభాషణలు కనుక టాప్ చేయాలనుకుంటే హోం మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తుల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)కు భంగం కలిగించేది కాబట్టి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఈ చర్యకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమిటా అసాధారణ పరిస్థితులు అంటే సదరు వ్యక్తులు దేశభద్రతకు ముప్పు కలిగించే వ్యవహారాలూ చేస్తున్నా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేస్తున్నా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు.

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ఇవేమీ పట్టించుకున్నట్లు లేదు. ఎడాపెడా అనేకమంది టెలిఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి నట్టు వివరాలు బయటకు వస్తున్నాయి. ఇట్లా ట్యాప్ చేసిన ఫోన్లలో ప్రత్యర్థి రాజకీయ నాయకులే కాకుండా ఇతర రంగాలకు సంబంధించిన పలువురు, చివరకు జర్నలిస్టులు, న్యాయమూర్తులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. వీళ్ళంతా ఏ విధంగా దేశభద్రతకు ముప్పు కలిగిస్తారో, ఏ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందో ఈ వ్యవహారం నడిపిన వాళ్ళే చెప్పాలి. రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి లేదా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కుట్రను ఛేదించడానికి అప్పుడు అధికారంలో ఉన్నవారు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చెప్తున్నారు. అప్పుడు అధికారాల్లో ఉన్న పక్షం అటువంటిది ఏమీ జరగలేదని పదేపదే చెబుతున్నా రెండు ఉదాహరణలు తమంతట తామే దానిని అంగీకరించినట్టు స్పష్టం చేస్తున్నాయి.

ఇటీవల మాజీ శాసనసభ్యుడు గోనే ప్రకాష్ రావు ఒక దగ్గర చెప్పినట్టు కొద్దిమంది టిఆర్‌ఎస్ శాసన సభ్యులను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ శివారులోని ఒక ఫారం హౌస్‌లో కుట్ర జరిగిందనే ఆధారాలు చూపడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బయటపెట్టిన ఆడియోలే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నడానికి ఒక ఉదాహరణ. మరొకటి టిఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఆ పార్టీలో ముఖ్యుడు, కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా పనిచేసిన వి. ప్రకాష్ ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వంలోని ఒక ముఖ్యుడు తన ఫోన్ ట్యాప్ అవుతున్నదని, ఎవరూ తనకు ఫోన్ చేయవద్దని సూచించినట్టుగా చెప్పారు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తమ నీడను చూసి కూడా అప్పుడప్పుడు దడుచుకుంటారేమో అనుకోడానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతం మంచి ఉదాహరణ. మాజీ ముఖ్యమంత్రి రక్త సంబంధీకులను కూడా నక్సల్ సంబంధాల పేరుతో ట్యాపింగ్ చేయించడం అందుకు గొప్ప ఉదాహరణ.

ఈ ఉదాహరణలు సరిపోతాయి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనడానికి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక బృందం సేకరించిన ఆధారాల్లో పలువురు ప్రత్యర్థి రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఉన్నారు. అటువంటి వారందరినీ సాక్ష్యం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం తమ ముందు హాజరు కావలసిందిగా నోటీసులు పంపుతుండటం చూస్తున్నాం. నోటీసులు అందుకున్న ప్రముఖులలో పార్లమెంట్ సభ్యులు, ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉండడం విశేషం.2013లో కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు అరుణ్ జైట్లీ ఫిర్యాదు మేరకు పార్లమెంట్ ఏర్పాటు చేసిన హోం శాఖ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రజాప్రతినిధుల మీద ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ అవసరం అయినప్పుడు పార్లమెంట్ సభ్యులు అయితే లోక్‌సభ స్పీకర్ అనుమతి, శాసన సభ్యులైతే శాసన సభాధ్యక్షుడు అనుమతి తప్పనిసరిగా తీసుకుని కానీ చేయడానికి వీలు లేదు. ఇది ఆనాటి పార్లమెంటు ఆమోదం కూడా పొందినట్టు గుర్తు.

ఇటువంటి పద్ధతులూ, నిబంధనలు ఏవీ పాటించకుండా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా అర్థమవుతున్నది. ఇప్పటికే దాదాపు నలుగురు పోలీస్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జ్యూడిషియల్ రిమాండ్‌లో గడిపి బెయిల్ మీద వచ్చి ఉన్నారు. మరొక అధికారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యపాత్ర ఉందని చెప్తున్న అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి ప్రభాకరరావు కొంతకాలం అమెరికాలో ఉండి సుప్రీం కోర్టు కల్పించిన వెసులుబాటు కారణంగా ప్రస్తుతం అరెస్టు తప్పించుకొని ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరవుతున్నారు. దర్యాప్తులో ఆయన సహకరించడం లేదు కాబట్టి ఇచ్చిన ఆగస్టు అయిదు వరకు ఆయనను అరెస్ట్ చెయ్యరాదంటూ ఇచ్చిన వెసులుబాటును రద్దుచేసి పోలీసు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించవలసిందిగా సుప్రీం కోర్టును కోరడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం యోచిస్తున్నది.
ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందంతో సహకరించకపోగా,

తాను డ్యూటీ మాత్రమే చేశాను అని చెప్తున్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు ఆదేశించినంత మాత్రాన చట్టవ్యతిరేకమైన, అనైతికమైన వ్యవహారాలు చక్కబెట్టడం తన డ్యూటీలో భాగం కాదన్న విషయం ఈ ఉన్నతాధికారికి ఎందుకు జ్ఞాపకం రాలేదో అర్థం కాదు. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఒకసారి మొత్తం వ్యవహారాన్ని గురించి ఆలోచిద్దాం. ఆనాటి ముఖ్యమంత్రి తన రాజకీయ ప్రత్యర్థులు లేదా తన అధికారానికి ఇబ్బంది కలిగించే వాళ్లు అనుకున్న వారి కదలికల మీద నిఘా వేయడం కోసం ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకున్నారని అనుకుందాం. రేపు అంతిమంగా నష్టపోయేది ఎవరు? అన్ని రకాలుగా తమ కెరియర్ పరంగా, నైతికంగా కూడా నష్టం జరిగేది ఎవరికి? రాజకీయ నాయకత్వం చెప్పిన పని అనైతికం అనే విషయం గుర్తు చేయకుండా, ఇది చేయకూడదు అని చెప్పకుండా తలలు ఊపి వారి మెప్పు పొందడం కోసం చేసిన పని కారణంగా వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అర్థం అవుతున్నది.

ఎక్కడా లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా వాటిని అమలు పరిచిన వారంతా అన్ని విధాలుగా నష్టపోవడం తప్ప ఈ కేసు చివర్లో సాధించేది ఏమి ఉండదు. రాజకీయ పార్టీలను ప్రజలు ఐదేళ్లకు ఒకసారి ఎన్నుకుంటారు. నచ్చకపోతే మార్చుకుంటారు. అధికార యంత్రాంగం, ఉద్యోగులు మూడు నాలుగు దశాబ్దాలు ప్రజాధనం జీతాలుగా తీసుకుంటూ ప్రజాసేవ చేయడం కోసం నియమితులవుతారు. అంతేకాదు ఎప్పటికప్పుడు అధికారంలో ఉండే రాజకీయ నాయకత్వాన్ని అప్రమత్తం చేసి సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత అధికార యంత్రాంగానిది. దురదృష్టవశాత్తు రాజకీయపక్షాల కంటే ఎక్కువ లేదా ఆ పక్షాలతో సమానంగా పోటీ పడుతూ అప్రతిష్టపాలు కావడానికి అధికార యంత్రాంగంలోని పలువురు ఉవ్విళ్ళూరుతుండడం ఈ కాలపు విషాదం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇందుకు పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. దీని నుండి గుణపాఠం తీసుకునే ప్రయత్నం అధికార యంత్రం చేస్తుందేమో చూడాలి.

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News