Saturday, July 27, 2024

30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి…

- Advertisement -
- Advertisement -

14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు
న్యూఢిల్లీ : అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలికకు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతించింది. దీనిని ‘అసాధారణ’ కేసుగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం , విస్తృత అధికారాలను ఉపయోగించుకుని తీర్పు వెలువరించింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురై గర్భం దాల్చింది. కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని ఈనెల ఆరంభంలో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గర్భవిచ్ఛిత్తికి నిరాకరించింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో ఉందని, ఇప్పుడు విచ్ఛిత్తి చేస్తే పూర్తిగా రూపుదిద్దుకున్న పిండస్థ శిశువు జన్మించే అవకాశముందని అభిప్రాయపడింది. ఈమేరకు బాలిక తల్లి పిటిషన్‌ను ఏప్రిల్ 4న కొట్టేసింది. ఈ తీర్పుపై బాధితురాలి తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై గతవారం విచారణ జరిపిన న్యాయస్థానం , ముంబై లోని సియాన్ ఆస్పత్రి మెడికల్ బోర్డును నివేదిక కోరింది. గర్భవిచ్ఛిత్తిపై తీసుకునే నిర్ణయం వల్ల బాలిక శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉండనుందో చెప్పాలని సూచించింది. దీనిపై మెడికల్ బోర్డు న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.

“ ఈ సమయంలో గర్భవిచ్ఛిత్తితో కొంత ప్రమాదం ఉన్నప్పటికీ , కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదు.. ఈ గర్భాన్ని కొనసాగించడం వల్ల బాలికపై శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుంది” అని నివేదికలో పేర్కొంది. దీన్ని పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు రాజ్యాంగం లోని ఆర్టికల్ 142 కింద ఉన్న విస్తృత అధికారాలలో ఈ తీర్పు వెలువరిస్తున్నట్టు తెలిపింది.

ఆ బాలికకు తక్షణమే వైద్యపరంగా గర్భవిచ్ఛిత్తి చేయాలని సియాన్ ఆస్పత్రి డీన్‌ను ఆదేశించింది. సాధారణంగా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రిగ్నెన్సీ చట్టం ప్రకారం వివాహిత మహిళలు ప్రత్యేక అవసరాలున్నవారు , అత్యాచార బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి ఉంది. ఆ సమయం దాటితే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News