Friday, April 19, 2024

ఎలాంటి విచారణకైనా సిద్ధం : శశికళ

- Advertisement -
- Advertisement -

Prepare for any inquiry : V K Sasikala

జయలలిత వైద్యంపై సంచలనాలు

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, వైద్యం విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదికపై ఆమె నెచ్చెలి శశికళ తీవ్రంగా స్పందించారు. శశికళ చెప్పినట్టుగానే జయకు చికిత్స అందిందని, కమిషన్ చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. జయలలిత వైద్యం విషయంలో తాను ఏనాడూ జోక్యం చేసుకోలేదని, దీనిపై ఎలాంటి విచారణ ఎదుర్కొనేందుకైనా సిద్ధమని శశికళ స్పష్టం చేశారు. “ నాపై ఆరోపణలు చేస్తున్నందుకు నాకేం బాధలేదు. ఇవన్నీ నాకేం కొత్తకాదు. కానీ ఇప్పుడు నా అక్క (జయలలిత) ప్రతిష్ఠకు కూడా భంగం కలుగుతున్నందుకు బాధగా ఉంది. నేను జైలుకు వెళ్లాక కొందరు అమ్మ మరణాన్ని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. డిఎంకె కుట్రలకు లొంగి పోయారు. నన్ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు చాలా మార్గాలుంటాయి. అంతేగానీ ఇలా అమ్మ మరణాన్ని ఉపయోగించుకోవడం క్రూరత్వం… ముందు అమ్మ మృతిని రాజకీయం చేశారు. ఇప్పుడు ఆరుముగ స్వామి కమిషన్ నివేదికను కూడా రాజకీయం చేస్తున్నారు.

” అని శశికళ ఆరోపించారు. “ జయలలిత తొలుత వికిత్సకు స్పందించారు. కోలుకుని డిశ్చార్జి అవుతారనుకునే లోపే దురదృష్ట వశాత్తు మనల్ని వదిలి వెళ్లి పోయారు. కానీ ఇప్పుడు కమిషన్ నాపై నిందలు వేస్తోంది. మాది 30 ఏళ్ల స్నేహబంధం. అన్నేళ్ల పాటు ఆమెను అమ్మలా కాపాడుకున్నా. ఆమె చికిత్స విషయంలో నేను ఏనాడూ జోక్యం చేసుకోలేదు. ఆమెకు అత్యుత్తమ వైద్యం అందించాలనే కోరుకున్నా. చికిత్స కోసం ఆమెను విదేశాలకు తీసుకెళ్లకుండా నేనెప్పుడూ అడ్డుకోలేదు. ఎయిమ్స్ వైద్యులు కూడా ఆమెకు యాంజియో పరీక్షలు అవసరం లేదనే చెప్పారు. ఊహాగానాలతో ఇచ్చిన ఈ నివేదికను ప్రజలెవరూ నమ్మరు. ఆరుముగస్వామి కమిషన్ చేసిన ఆరోపణలన్నింటినీ నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇందులో ఎలాంటి విచారణ ఎదుర్కోడానికైనా నేను సిద్ధమే ” అని శశికళ తెలిపారు. అనారోగ్యంతో కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో ఉన్న జయలలిత చికిత్స పొందుతూఏ 2016 డిసెంబరులో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణంపై అప్పట్లో అనేక అనుమానాలు రావడంతో అప్పటి ప్రభుత్వం జస్టిస్ ఆరుముగస్వామి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ విచారణ నివేదికను తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగా, దానిని మంగళవారం శాసన సభలో ప్రవేశ పెట్టారు. జయలలిత మరణం, ఆమెకు అందించిన వైద్యం విషయంలో మొత్తం 8 మందిపై కమిషన్ అభియోగాలు మోపింది. ముఖ్యంగా ఆమె నెచ్చెలి శశికళ చెప్పినట్టుగానే జయకు వైద్యం జరిగినట్టుగా ఉందని కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News