Sunday, June 1, 2025

2014-2023 సినిమాలకు గద్దర్ అవార్డులు

- Advertisement -
- Advertisement -

ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు
బాలకృష్ణ, సుకుమార్, మణిరత్నం, విజయ్ దేవరకొండ, అట్లూరి పూర్ణచంద్రరావు, యండమూరి వీరేంద్రనాథ్‌లకు ప్రత్యేక అవార్డులు
రుద్రమదేవి, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్, మహానటి, మహర్షి, అల వైకుంఠపురంలో, బలగం చిత్రాలకు గద్దర్ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను (Gaddar Awards) 2024 ఏడాదిగాను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాలను అవార్డులకు ఎంపికచేశారు. ఈ మేరకు సినీ నటుడు, జ్యూరీ ఛైర్మన్ మురళీమోహన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి చిత్రాల పేర్లను తెలియజేశారు. ఎఫ్‌డిసి ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజుతో కలిసి ఆయన గద్దర్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించారు. 2014 జూన్ 2 తర్వాత సెన్సార్ అయిన సినిమాల నుంచి డిసెంబర్ 2023 వరకు వచ్చిన చిత్రాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మురళీ మోహన్ వెల్లడించారు. వాటితో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు, ఆరు ప్రత్యేక అవార్డులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య, బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి- – చక్రపాణి అవార్డులతో పాటు అదనంగా పైడి జయరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను మీడియా సమక్షంలో జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు, నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, దర్శకుడు మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు, దర్శకుడు సుకుమార్‌కు బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డు, నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డు, నటుడు విజయ్ దేవరకొండకు కాంతారావు ఫిల్మ్ అవార్డు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును ప్రకటించారు. ఇదిలాఉండగా 2014 నుంచి 2023 వరకు ప్రకటించిన ప్రథమ ఉత్తమ చిత్రాల్లో అనుష్క నటించిన రుద్రమదేవి, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్, అలనాటి ఉత్తమ నటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి, మహేష్‌బాబు నటించిన మహర్షి, అల్లు అర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురంలో, తెలంగాణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న బలగం వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ ఉన్నాయి. ఈ జాబితాలో నిలిచిన చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన అత్యుత్తమ సృజనాత్మకతకు, సాంకేతిక విలువలకు అద్దం పడుతున్నాయి. ఇక తెలుగు సినిమాలకు వివిధ విభాగాలలో 2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంతోషం వ్యక్తం చేసింది.

ఆరు ప్రత్యేక అవార్డులు..
ఎన్టీఆర్ జాతీయ అవార్డు: బాలకృష్ణ
పైడి జయరాజ్ అవార్డు: మణిరత్నం
బి.ఎన్. రెడ్డి అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు: అట్లూరి పూర్ణ చందర్‌రావు
కాంతారావు అవార్డు: విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్

2014-23
ఉత్తమ చిత్రాలు

ఉత్తమ చిత్రాలు 2014:
రన్ రాజా రన్
పాఠశాల
అల్లుడు శీను
ఉత్తమ చిత్రాలు 2015:
రుద్రమ దేవి
కంచె
శ్రీమంతుడు
ఉత్తమ చిత్రాలు 2016:
శతమానం భవతి
పెళ్లి చూపులు
జనతా గ్యారేజ్
ఉత్తమ చిత్రాలు 2017:
బాహుబలి 2
ఫిదా
ఘాజీ
ఉత్తమ చిత్రాలు 2018:
మహానటి
రంగస్థలం
కేరాఫ్ కంచరపాలెం
ఉత్తమ చిత్రాలు 2019:
మహర్షి, జర్సీ
మల్లేశం
ఉత్తమ చిత్రాలు 2020:
అల వైకుంఠపురంలో
కలర్ ఫొటో
మిడిల్ క్లాస్ మెలోడిస్
ఉత్తమ చిత్రాలు 2021:
ఆర్‌ఆర్‌ఆర్, ఆఖండ
ఉప్పెన
ఉత్తమ చిత్రాలు 2022:
సీతారామం, కార్తికేయ 2
మేజర్
ఉత్తమ చిత్రాలు 2023:
బలగం, హనుమాన్
భగవంత్ కేసరి.

దైవ నిర్ణయంగా, నా తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నా: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ పురష్కారాల్లో భాగంగా తనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రకటించడంపై స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. “ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన సమయం ఒకవైపు.. ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతోన్న శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్బం ఇంకొక వైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్‌తో సత్కరించిన ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ ప్రకటించడం నా అదృష్టం. దీనిని దైవ నిర్ణయంగా, నా తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నా”అని బాలకృష్ణ అన్నారు.

గొప్ప గౌరవం: కాంతారావు ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డుకు ఎంపిక అయినందుకు సంతోషిస్తున్నా. నాపై నమ్మకం ఉంచి.. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. 2016లో పెళ్లి చూపులు చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు”అని అన్నారు.

తెలుగు రాష్ట్రాలు ఒక అవగాహనకు రావాలి
తెలుగు సినిమాకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవార్డులు ఇచ్చే విషయంలో ఒక అవగాహనకు రావాలని గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. అవార్డులను ప్రకటించాక ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా అవార్డులను ప్రకటించాలని మురళీ మోహన్ కోరారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయానికి రావాలని కో రారు. ముఖ్యంగా.. ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే, ఆ తర్వాత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలని సూచించారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదని చెప్పారు. సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులంతా ఒకటేనని స్పష్టం చేశారు. అందుకే టాలీవుడ్ ప్రేక్షకుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి కృతజ్ఞతలు
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును తనకు ప్రకటించడంపై సుకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారాల్లో బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ప్రకటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నన్ను ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు జ్యూరీకి నా కృతజ్ఞతలు. తెలుగు సినిమా రంగంలో శిఖరం లాంటి బీఎన్ రెడ్డి పేరు మీద ఉన్న అవార్డు అందుకోవడం మరింత గౌరవంగా అనిపిస్తుంది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News