Saturday, April 27, 2024

ఫైనల్లో పుణెరి పల్టాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో మూడు సార్లు ఛాంపియన్ పట్నా పైరేట్స్‌పై పుణెరి పల్టాన్ 37-21తో ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన పుణెరి పల్టాన్ సెమీఫైనల్లోనూ అదే జోరును కనబరిచింది. పుణెరి పల్టాన్ ఆటగాళ్లలో అస్లాం ఇనాందార్ (7), పంకజ్ మోహిత్ (7) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున సచిన్ (5), మంజిత్ (4) మెరిసినా.. ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. ప్రొ కబడ్డీ లీగ్‌లో రెండోసారి టైటిల్ పోరుకు చేరుకున్న పుణెరి పల్టాన్.. శుక్రవారం జరిగే ఫైనల్లో రెండో సెమీఫైనల్ విజేతతో తలపడనుంది. తొలి రైడ్‌లోనే అస్లాం ఇనాందార్ పాయింట్ తీసుకొచ్చి పుణెరి పల్టాన్ పాయింట్ల ఖాతా తెరిచాడు.

అస్లాం ఇనాందార్‌కు పంకజ్ మోహిత్ సైతం జతకలవటంతో పుణెరి పల్టాన్ దూసుకెళ్లింది. ప్రథమార్థం ఆట ముగిసే సమయానికి 20-11తో 9 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇక సెకండ్ హాఫ్‌లో పట్నా పైరేట్స్ పుంజుకునేందుకు ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఆ జట్టు తరఫున స్టార్ రైడర్ సచిన్ నాలుగుసార్లు మాత్రమే కూతకెళ్లి పాయింట్లు తీసుకొచ్చాడు. డిఫెండర్ మంజిత్ సైతం కూతకెళ్లి నాలుగు పాయింట్లే సాధించాడు. డిఫెండర్ సందీప్ కుమార్(మూడు ట్యాకిల్స్) సైతం అంచనాలను అందుకోలేకపోయాడు. మరోవైపు పుణెరి పల్టాన్ సమిష్టి ప్రదర్శనతో ఆద్యంతం ఆధిక్యంలో కొనసాగించింది. మోహిత్ గోయత్ కండ్లుచెదిరే డూ ఆర్ డై రెయిడ్‌లో మెరవటంతో పుణెరి పల్టాన్ మరింత దూకుడు కొనసాగించింది. దీంతో 37-21తో భారీ తేడాతో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News