అహ్మదాబాద్: హోరాహోరీగా సాగిన ఐపిఎల్ సీజన్ 2025లో పంజాబ్ కింగ్స్ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. పాయింట్ల పట్టికలో ఏకంగా అగ్రస్థానంలో నిలిచి ఔరా అనిపించింది. శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీతో పంజాబ్ను ముందుండి నడిపించాడు. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతూ వారి నుంచి మెరుగైన ఫలితాలను రాబట్టాడు.
దాదాపు ప్రతి మ్యాచ్లో జట్టుకు అండగా నిలిచాడు. ఓపెనర్లు ప్రియాంశ్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్లు కూడా తమవంతు పాత్రను సమర్థంగా పోషించారు. శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్లు కూడా స్థాయికి తగ్గ ఆటతో అలరించారు. బౌలర్లు అర్ష్దీప్ సింగ్, చాహల్ తదితరులు కూడా మెరుగైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఇలా ప్రతి ఆటగాడు తనవంతు సహకారం అందించడంతో పంజాబ్ రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో కూడా పోరాడి ఓడింది.