Thursday, March 28, 2024

నేడు తెలంగాణాకు భారత్ జోడో యాత్ర

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi Bharat Jodo Yatra enter into Telangana today

నేడు తెలంగాణాకు భారత్ జోడో యాత్ర
నేటి నుండి తెలంగాణాలో రాహుల్ కవాతు..
19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజక వర్గాల్లో యాత్ర
తెలంగానాలో 375 కిలోమీటర్లు నడవనున్న రాహుల్
13 కమిటీలతో పిసిసి విస్తృత ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో బిజెపి విద్వేష, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా జాతి సమైక్యత కోసం రాహుల్ చేస్తున్న కవాతు తెలంగాణాలో కాలు పెట్టబోతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర ఆదివారం తెలంగాణాలో అడుగుపెట్టనుంది. కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు సాగుతున్న రాహుల్ కవాతు తెలంగాణాలో కాంగ్రెస్ అధికార జోష్‌కు ముందడుగు వేయనుంది. నాలుగు రాష్ట్రాలు దాటి 1500 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసుకోబోతున్న భారత్ జోడో తెలంగాణాలో కొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలవబోతుంది.
తెలంగాణాలో అడుగుపెట్టనున్న భారత్ జోడో యాత్ర
కర్నాటకలోని రాయచూర్ నుండి 23 తేది ఉదయం 10 గంటలకు తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా, గూడబెల్లూరులో అడుగుపెట్టనుంది. కర్నాటక, తెలంగాణా సరిహద్దులోని గూడబెల్లూరులో రాహుల్ భారత్ జోడో యాత్రను స్వాగతించేందుకు పిసిసి ఘన ఏర్పాట్లు చేసింది. గూడబెల్లూరులో అల్పాహారం అనంతరం మద్యాహ్నం నుండి యాత్ర దీపావళి నిమిత్తం మూడు రోజులపాటు అంటే 26వ తేది వరకు బ్రేక్ తీసుకోనుంది. అనంతరం 27 తేది ఉదయం గూడబెల్లూరులో ప్రారంభం కానున్న యాత్ర మక్తల్ చేరుకుని తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతూ నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాదారణ బ్రేక్ తీసుకోనున్న యాత్ర తదనంతరం 12 రోజులపాటు జనజీవన స్రవంతితో ముందుకు సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధి రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలులో యాత్ర..
తెలంగాణాలోని మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టే పాదయాత్ర, నారాయణ్ పేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్ర నగర్, బహుదూర్ పుర, చార్మినార్, గోషా మహల్, నాంపల్లి, ఖైతరాబాద్, కూకట్ పల్లి, శేరిలింగపల్లి, పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మహబూబ్ నగర్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది. ఇక నాలుగు రాష్ట్రాలను దాటుతూ వచ్చిన రాహుల్ పాదయాత్రలో అతిపెద్దనగరంగా హైదరాబాద్ ప్రవేశించనుండగా నగరంలో ఆరాంఘర్, చార్మినార్, మోజాంజాహి మార్కెట్, గాంధి భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట, పెద్ద శంకరం పేట, మద్కూర్ అంటూ సాగనుంది.
యాత్రలో మేదావులు, మత పెద్దలు, వివిద వర్గాలు..
రాహుల్ తెలంగాణాలో జరిపే యాత్రలో భాగంగా మేధావులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ వర్గాలు, మత పెద్దలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులతో భేటి అవనుండగా కొందరు రాహుల్ తో యాత్రలో పాదం కలిపేందుకు సిద్దమవుతున్నారు. ప్రదానంగా తెలంగాణాలో రాహుల్ యాత్రలో కొన్ని ప్రార్ధనా మందిరాలు, మజీదులు, హిందూ ఆలయాలను సందర్శించనున్నారు. సర్వమత ప్రార్థనలు కూడా చేయనున్నారు.
పిసిసి విసృత ఏర్పాట్లు
భారత జాతి సమైక్యతా నినాదంతో తెలంగాణాలో అడుగుపెడుతున్న రాహుల్ గాంధి భారత్ జోడో యాత్రకు టిపిసిసి విసృత ఏర్పాట్లు చేయనుంది. పలు బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నర్ సమావేశాలలో కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకునే విదంగా ప్రత్యేక కార్యక్రమాలతోపాటు పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విదానాలతోపాటు రూట్ మ్యాప్ పై పిసిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలు సారధ్యం వహించనున్న ఈ 10 కమిటీలతో పాదయాత్ర పొడవునా యాత్రను సమన్వయం చేసుకుంటూ రాహుల్ గాంధితో కలిసి ముందుకు సాగనున్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకు పోతున్న కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, భారరత్ జోడో యాత్రను కూడా సమన్వయం చేసుకుంటూ రాహుల్ కవాతును విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు భారీ ఏర్పాట్లతో సిద్దంగా ఉంది.

Rahul Gandhi Bharat Jodo Yatra enter into Telangana today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News