Friday, April 26, 2024

సిట్టింగ్ ఎంపికి శిక్ష పడితే ఏం జరుగుతుంది?

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: మోడీ ఇంటిపేరుకు సంంబంధించిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో(పరువునష్టం దావా) గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన శిక్షతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడైనట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం ప్రకటించింది. దోషిగా నిర్ధారణై శిక్ష పడిన సిట్టింగ్ ఎంపి లేదా ఎమ్మెల్యే అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి తెలుసుకుందాం.

2013లో లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఒక సిట్టింగ్ ఎంపి లేదా ఎమ్మెల్యేని దోషిగా కోర్టు ప్రకటిస్తే ఆ వ్యక్తి తన సభ్యత్వాన్ని తక్షణమే కోల్పోయి ఆ సీటు ఖాళీ అవుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(4) సెక్షన్ చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ సెక్షన్ అమలులో ఉన్నకాలంలో ఒక ఎంపి లేదా ఎమ్మెల్యే దోషిగా నిర్ధారణ అయినప్పటికీ 90 రోజుల లోపు పైకోర్టులో అప్పీలు చేసుకుని సభ్యుడిగా కొనసాగవచ్చు. అయితే, ఈ సెక్షన్ రద్దయిపోవడంతో రాహుల్ గాంధీ అనర్హత అనివార్యమైంది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(1), 8(2), 8(3) సెక్షన్ల పరిధిలోకి వచ్చే శిక్షలు మాత్రమే తక్షణ అనర్హతకు దారితీస్తాయని ఇక్కడ గమనించాలి.

కాగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1) పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన సిట్టింగ్ సభ్యుల, ఆశిస్తున్న అభ్యర్థుల అనర్హతకు సంబంధించిన షరతులను నిర్దేశిస్తుండగా ఆర్టికల్ 191(1) మాత్రం రాష్ట్ర అసెంబ్లీ లేదా శాసన మండలికి చెందిన సిట్టింగ్ సభ్యులు, ఆశిస్తున్న అభ్యర్థుల అనర్హత గురించి షరతులను చెబుతుంది. అయితే సిట్టింగ్ సభ్యులకు ప్రత్యేక హక్కులను కల్పించే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4)ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.

ఈ తీర్పుతో నేర చరిత్రగల వ్యక్తులకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో రాజకీయ పార్టీలు ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందని భావించవచ్చు. శిక్ష పడిన ఎంపి లేదా ఎమ్మెల్యే తన సభ్యత్వాన్ని కోల్పోతాడన్న సందేశం వెళ్లడం వల్ల నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు పోటీకి దూరంగా ఉండే అవకాశం కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News