Friday, April 19, 2024

వెనుక చూపించే అద్దాన్ని చూసి“ భారత్ కారు” నడుపుతున్న మోడీ : రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భవిష్యత్‌ను దర్శించడంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ “అసమర్ధులని” , భారత్ అనే కారును వెనుకను చూపించే అద్దం లోంచి చూసి నడపడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని, అందువల్ల ఒక ప్రమాదం వెనుక మరో ప్రమాదానికి దారి తీస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అమెరికా లోని జేవిట్స్ సెంటర్‌లో ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ ఆదివారం భారీ ఎత్తున నిర్వహించే సామాజిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బీజేపీని లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ని ఏదైనా అడిగితే వారు గతంలోకి చూస్తారని విమర్శించారు. “రైలు ప్రమాదం ఎలా ఎందుకు జరిగిందని బీజేపీని ప్రశ్నిస్తే వారు కాంగ్రెస్ హయాంలో కూడా ప్రమాదాలు జరిగాయి కదా అని సమాధానం ఇస్తారు. అలాంటి సంఘటన 50 ఏళ్ల క్రితం జరిగింది. ” అని రాహుల్ ఉదహరించారు.

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదాల సంఘటన దేశం లోనే జరిగిన రైలు ప్రమాదాల్లో చాలా అధ్వాన్నమైన సంఘటనగా విమర్శించారు. “పాఠ్యపుస్తకాల నుంచి పిరియాడిక్ టేబిల్‌ను ఎందుకు తొలగించారని బీజేపిని అడిగితే వారు 60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ చేసిన దాన్ని గుర్తు చేస్తారు. వారి తక్షణ స్పందన వెనక్కు చూడడం” అని వ్యాఖ్యానించారు. “ మీరు వాటిని వినండి.. వారి మంత్రులు చెప్పినవి వినండి, ప్రధాని మోడీ చెప్పినవి వినండి వారు చెప్పిందాంట్లో భవిష్యత్ గురించి ఏదీ ఉండదు. వారు ఎంతసేపూ గతం గురించే చెబుతుంటారు. గతం గురించి ఎవరినో ఒకరిని నిందిస్తుంటారు ” అని రాహుల్ వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగింది.

కానీ కాంగ్రెస్ ఇది బ్రిటిష్ వారి పొరపాటని ఎప్పుడూ చెప్పలేదు సరికదా రైలు ప్రమాదానికి తాను బాధ్యత వహిస్తానని నైతికంగా కాంగ్రెస్ మంత్రి రాజీనామా చేశారు” అని రాహుల్ గతాన్ని గుర్తు చేశారు. భారత్‌లో రెండు సిద్ధాంతాల పై పోరాటం జరుగుతోందని,అందులో ఒకవైపు మహాత్మాగాంధీ ఉండగా, మరోవైపు నాథూరాం గాడ్సే ఉన్నారని రాహుల్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News