ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో బుధవారం ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చావో రేవో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకమైంది. ఈ మ్యాచ్లో ముంబై విజయం సాధిస్తే.. నేరుగా ప్లేఆఫ్స్కి వెళ్తుంది. ఢిల్లీ (DC) ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఢిల్లీ తప్పనిసరిగా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది.
అయితే ఈ మ్యాచ్కు వర్ష గండం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆక్యూమీటర్ ప్రకారం వచ్చే నాలుగు రోజుల్లో ముంబైలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారణంగా అక్కడ ఎల్లో అలర్ట్ కూడా జారీ చశారు. వాన పడేందుకు 80 శాతం అవకాశాలు ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దైతే.. ఢిల్లీ తీవ్ర నష్టం ఎదురుకోక తప్పదు. మ్యాచ్ క్యాన్సిల్ అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.
ఇప్పటికే ఏడు మ్యాచుల్లో విజయం సాధించి 14 పాయింట్లతో ఉన్న ముంబై (MI) జట్టుకు మరో పాయింట్ చేరుతుంది. మరోవైపు ఆరు మ్యాచులు గెలిన ఢిల్లీ 13 పాయింట్లకు చేరుతుంది. ఆ క్రమంలో ఇరు జట్లకు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆ రెండు మ్యాచులు పంజాబ్ కింగ్స్తోనే తలపడాలి. దీంతో ఢిల్లీ (DC) కచ్చితంగా పంజాబ్పై గెలిచి తీరాల్సి వస్తుంది. అంతేకాక.. ముంబై పంజాబ్ చేతిలో ఓడితేనే.. ఢిల్లీ ప్లే ఆఫ్స్కి చేరుతుంది. దీంతో ఢిల్లీ భవిష్యత్తు ఒకవైపు వరుణుడి చేతిలో మరోవైపు పంజాబ్ చేతిలో ఉంది.