Friday, April 26, 2024

కర్నాటక శకటంకు ఈసారి నో ఛాన్స్!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: గత ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నందుకు ఈ ఏడాది కర్నాటక శకటానికి అవకాశం దక్కలేదని కర్నాటక శకటం నోడల్ ఆఫీసర్ సి.ఆర్. నవీన్ ఆదివారం తెలిపారు. గత 13 సంవత్సరాలుగా కర్నాటక శకటం గణతంత్ర దినోత్సవంలో పాల్గొంటూ వస్తోంది. కానీ ఇలా తిరస్కృతికి గురికావడం ఇదే తొలిసారి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య అగ్గి రాజుకుంది. ట్విట్టర్‌లో విమర్శల వెల్లువ చోటుచేసుకుంది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కర్నాటక శకటానికి ఈసారి అవకాశం లేదని సమాచార, పౌరసంబంధాల శాఖ(డిఐపిఆర్) ప్రకటన జారీచేసింది. గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో గత ఎనిమిదేళ్లలో అతి తక్కువ సార్లు పాల్గొన రాష్ట్రాలకు అవకాశం కల్పించాలన్న అభిమతంతోనే ఈసారి మార్గదర్శకాలు రూపొందించడం జరిగిందని పేర్కొంది. “గత కొన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్న రాష్ట్రాలు, ఈసారి పాల్గొంటున్న రాష్ట్రాల జాబితాను చూస్తే…2022లో బహుమతి గెలుచుకున్న మూడు రాష్ట్రాలను ఈసారి జాబితాలో చేర్చలేదు. గత ఏడాది పాల్గొన్న రాష్ట్రాలను కూడా ఈసారి చేర్చలేదు. కనుక, ఈసారి కర్నాటకకు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కలేదు” అని ఆ నోట్ పేర్కొంది.

కర్నాటక రాష్ట్ర శకటానికి అవకాశం దక్కకపోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సిద్ధరామయ్య ట్విట్టర్ ద్వారా కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను తీవ్రంగా విమర్శించారు. “గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఈ ఏడాది కర్నాటక శకటం పాల్గొనలేకపోవడం దురదృష్టకరం. కర్నాటక శకటం తిరస్కృతిపై కర్నాటక బిజెపి ఎంత సీరియస్‌గా ఉన్నదన్నది, మన రాష్ట్ర గౌరవాన్ని ఎంతగా నిలబెడుతున్నది అన్నది ప్రస్ఫుటం అవుతున్నది” అని విమర్శించారు. అయితే ఓ సీనియర్ అధికారి దేశంలో గత 13 సంవత్సరాలుగా నిరాటంకంగా గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో శకటాన్ని ప్రదర్శించిన రాష్ట్రం కర్నాటక ఒకటే అన్నారు. దశాబ్ద కాలం పాటు కర్నాటక తన సంస్కృతి వైభవాన్ని చాటుకుందన్నారు. 2005లోనైతే కర్నాటక శకటం ప్రథమ బహుమతిని కూడా అందుకుందన్నారు. నాలుగుసార్లు తృతీయ బహుమతినందుకుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News