Saturday, April 20, 2024

షీ ఇన్ ‘తేలుకుట్టిన దొంగ’ కథ!

- Advertisement -
- Advertisement -

షీ ఇన్ అనే ఒక చైనా కంపెనీతో మన దేశ బడా సంస్థ రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్రం ఆమోద ముద్రవేసినట్లు వార్త. దీని గురించి మీడియా చాలా పరిమితంగా మాత్రమే వార్త లు ఇచ్చింది. పెద్ద హడావుడి లేదు. ఎందుకంటే చైనా వ్యతిరేకతను వెల్లడించటమే అసలు సిసలు దేశభక్తి అన్నట్లు అవకాశం దొరికినపుడల్లా ప్రదర్శిస్తున్న వారికి ఇది తేలుకుట్టిన దొంగ పరిస్థితే మరి. అమెజాన్ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్ర మోడీ సర్కార్ శాయశక్తులా చూస్తోంది. గతంలో అమెజాన్ అధిపతి బెజోఫ్ ఢిల్లీ వచ్చినపుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్ర మోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు. ఇంతకీ షీ ఇన్ కంపెనీ, దాని యాప్ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్నుపడిందంటే మూడేండ్ల క్రితం దాన్ని నిషేధించినా అమెజాన్ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహి స్తూ లాభపడుతున్నది. ఆ లబ్ధిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపోతుంది. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ, అసలు ఉండదు అన్నది కొందరి ప్రగాఢ విశ్వాసం.

నరేంద్ర మోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఘ్ పరివార్ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశభక్తి అలాంటిది. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే.స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకోవచ్చన్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్ధిదారు అంబానీ. నరేంద్ర మోడీతో 2014లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.
రష్యా ముడి చమురుతో తయారైన ఉత్పత్తులను భారత్ నుంచి దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య తొలిసారిగా తన దేశాలను కోరింది. భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు రష్యా ముడి చమురుతో చేసినవేనని, వాటిని దిగుమతి చేసుకుంటే రష్యా మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘించటమే అని సమాఖ్య విదేశాంగ విధాన ఉన్నత ప్రతినిధి జోసెఫ్ బోరెల్ వర్ణించారు. పీపా ముడి చమురును 60 డాలర్లకు మించి కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా, ఐరోపా దేశాలు బెదిరించిన సంగతి తెలిసిందే.

బోరెల్ విమర్శలను మన విదేశాంగ మంత్రి జైశంకర్ తోసిపుచ్చారు.తాము ఎగుమతి చేస్తున్న వాటిని భారత ఉత్పత్తులుగానే చూడాలి అన్నారు. మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కంటే రష్యా నుంచి వస్తున్నదానికి పది డాలర్లు తక్కువ చెల్లిస్తున్నాము. ఈ దిగుమతుల్లో 80 శాతం పైగా రిలయన్స్, మరో ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని డీజిలు, పెట్రోలు, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేస్తూ లాభా లు పొందుతున్నాయి.దీని వలన మన జనానికి ఎలాంటి లాభ మూ లేదు. ఇది మోడీ అసలైన స్వాతంత్య్ర ఫలం. ఇక తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ధి గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్ కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్ ఫ్యాషన్ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్ డాలర్లు. ఫ్యాషన్ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్, యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది.

గత ఏడాది నాటికి మూడు వేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో “షి ఇన్ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు” అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను షీ ఇన్ తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా! రిలయన్స్ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్ పేరును ముందుకు తెచ్చారు.
గాల్వాన్ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు. ఐటి చట్టంలోని సెక్షన్ 69ఎ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొనేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి.

సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19 లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథో సంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనాలోని ఉఘీర్ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.
ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్ రిటెయిల్స్ సేకరణ సామర్ధ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించిందని ఫైనాన్సియల్ టైవ్‌‌సు తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది.

గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్ ఫ్యాషన్ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియ డాలర్లు ఉండవచ్చని అంచనా. చైనాతో తలెత్తిన విభేదాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీ ఇన్ మార్కెట్ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మైంత్రా ప్రధాన విక్రేత గా ఉంది. షీఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు. ఫైనాన్సియల్ టైవ్‌‌సు పేర్కొన్నదాని ప్రకారం లైసన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో వచ్చే లాభాల్లో కొంత శాతం షిఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. చైనాలో ఉన్న తన ఎనిమిది వేల మంది సరఫరదారుల నుంచి సేకరించే దుస్తులతోపాటు భారత్‌లో రిలయన్స్ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వంటి వారు సి ప్లస్ 1 అంటే చైనా ప్లస్ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్, టాటా, బిర్లా, అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ధి పొందవచ్చని చెబుతున్నారు.

చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్ధం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్న వాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో 2013లోనే అంటే నరేంద్ర మోడీ అధికారానికి రాకముందే సి ప్లస్1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్ ముందుకు వచ్చింది. అమెజాన్‌తోపోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢీకొట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం.

అందుకే అంబానీ వత్తిడికి లొంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్ర మోడీ అనుమతించారన్నది స్పష్టం. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని చవక దుకాణాలు విలేజ్ మాల్స్‌గా మారుస్తామని, ఆ కంపెనీల ఉత్పత్తులను విక్రయిస్తామని 2017 లో సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 29 వేల చౌకదుకాణాల్లో తొలి దశలో 6,500లను మాల్స్‌గా మార్చాలని, వాటికి అన్న (ఎన్‌టిఆర్) విలేజ్ మాల్స్ అనే పేరు పెట్టాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫ్యూచర్ గ్రూప్‌ను ఎందుకు కలిపారంటే చంద్రబాబుకుచెందిన హెరిటేజ్ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది ఆచరణలోకి రాలేదు.
గాల్వాన్ లోయలో మన సైనికుల మీద చైనా మిలిటరీ దాడి చేసి చంపిన దానికి ప్రతీకారం అంటూ నాడు చైనా యాప్‌ల మీద, చైనా పెట్టుబడుల మీద నిషేధం విధించారు. గాల్వాన్ ఘర్షణ తరువాత చైనా వస్తువులను నిషేధించాలని కాషాయ దళాలు వీధుల్లో వీరంగం వేసిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. స్వదేశీ జాగరణ మంచ్ నిదురలేచింది. తరువాత అదే చైనా నుంచి మన దిగుమతుల అంశంలో మోడీ తన రికార్డులను తానే బద్దలు చేస్తున్నారు. వందల కోట్ల డాలర్లను ప్రతి ఏటా సమర్పించుకుంటున్నారు.

మన ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 2022 23లో మన చైనా దిగుమతులు 4.16 శాతం పెరిగి 98.51 బి.డాలర్లకు, చైనాకు మన ఎగుమతులు 28 శాతం తగ్గి 15.32 బి.డాలర్లుగా ఉన్నాయి. మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 72.91 నుంచి 83.2 బి.డాలర్లకు పెరిగింది. అదే మొనగాడు ఇప్పుడు అంబానీ కంపెనీ కోసం వాటిలో షీ ఇన్ అనే ఒక యాప్‌కు గుట్టుచప్పుడు కాకుండా అనుమతించేందుకు ఇచ్చేశారు. అటు జనం ఓట్లు ఇటు కార్పొరేట్ల నోట్లు కావాలి కదా! నరేంద్ర మోడీ ఒక చైనా కంపెనీ, యాప్‌ను తిరిగి అనుమతించటం ద్వారా ద్వారం తెరిచారు. వచ్చే రోజుల్లో ఏదో ఒకసాకుతో మిగిలిన వాటికి కూడా తెరుస్తారా? మన దేశానికి చెందిన ఏదో ఒక బడా కంపెనీకి లబ్ధి కలిగితే ఎలాంటి సందేహం లేకుండా అనుమతిస్తారని వేరే చెప్పనవసరం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News