Thursday, April 25, 2024

రియల్ సంస్థలపై ‘రెరా’ కొరడా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అనుమతి లేని సంస్థలు, ప్రజలను మోసం చేస్తున్న రియల్ సంస్థలపై రెరా కొరడా ఝుళిపిస్తోంది. రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజలను మోసం చేసిన ఐదు సంస్థలకు గతంలో రెరా నోటీసులివ్వగా మరో 14 సంస్థలకు రెరా నోటీసులు జారీ చేసి నట్టు తెలిసింది. గత కొంత కాలంగా ప్రజలను మోసం చేస్తున్న పలు రియల్ సంస్థలకు జరిమానా విధించిన రెరా మరోమారు ప్రజల ఫిర్యాదులపై స్పందించింది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలకు భారీగా జరిమానా విధించడంతో పాటు వాటిపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని నిర్ణయించింది.

ప్రీలాంచ్‌ల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించే మోసపూరిత రియల్ సంస్థలకు రెగ్యులర్‌గా నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెరా అథారిటీ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 14 సంస్థలకు నోటీసులను రెరా పంపించినట్టుగా తెలిసింది. గతంలో భువనతేజ ఇన్‌ఫ్రా, ఆర్‌జె హోమ్స్, ఏవి ఇన్‌ఫ్రా వంటి సంస్థలకు ఇదివరకే రెరా అథారిటీ నోటీసులను పంపించింది. అయినా ఆయా కంపెనీలు ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించిన ఈ సంస్థలపై ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను విధించడానికి రెరా అథారిటీ సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా మరో మారు ఈ సంస్థలకు నోటీసులను జారీ చేసినట్టుగా సమాచారం.

నోటీసులకు స్పందించకపోతే…

విజయవాడ హైవే మీద చౌటుప్పల్, సూర్యాపేట్, సంగారెడ్డి, సదాశివపేట్, నారాయణఖేడ్, షాద్‌నగర్, జడ్చర్ల, సాగర్ రోడ్డు, శ్రీశైలం హైవే, వరంగల్ హైవే ఆలేరు, యాదాద్రి వంటి ప్రాంతాల్లో చేసిన వెంచర్‌లకు అనుమతులు లేవని, ఈ నేపథ్యంలో ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులకు ఆ సంస్థల యజమానులు స్పందిస్తారో లేదో చూసిన తరువాత వాటిపై చర్యలు తీసుకోవాలని రెరా భావిస్తోంది.

జీ స్క్వేయిర్‌కు 200 ఎకరాలకు మాత్రమే అనుమతులు !

ప్రస్తుతం నోటీసులు అందుకున్న జీ స్వేయిర్, ప్రెస్టీజ్ సంస్థలు అనుమతి తీసుకున్న కొంతయితే వారు అమ్మేది చాలా ఉండడంతో ఆయా సంస్థలకు రెరా నోటీసులు జారీ చేసింది. చెన్నైకి చెందిన జీ స్క్వేయిర్ సంస్థ చౌటుప్పల్లో 1200 ఎకరాల్లో ఎపిటోమ్ అనే ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో 200 ఎకరాల్లో ప్లాట్లను అమ్మడానికి రెరా అనుమతిని తీసుకుంది. కానీ, మొత్తం పన్నెండు వందల ఎకరాలకు రెరా అనుమతి లభించినట్లు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని రెరా గుర్తించింది.

ప్రెస్టీజ్‌కు భారీ జరిమానా

బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సంస్థ కోకాపేట్‌లో ప్రీలాంచ్ పేరుతో ఫ్లాట్లను విక్రయించింది. ఈ విషయమై రెరాకు ఫిర్యాదు అందింది. ఇటీవల ఈ కంపెనీ రెరా అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించిన విషయం గుర్తించిన రెరా అథారిటీ ప్రతి ఫ్లాటు మీద రూ.25 వేలు జరిమానా విధించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇప్పటికే ప్రెస్టీజ్ సంస్థ 800 ఫ్లాట్లను ప్రీలాంచ్‌లో విక్రయించినట్టుగా రెరా గుర్తించింది. అయితే ఇక్కడ ఉన్న ఫ్లాట్లు 500ల వరకు ఉంటే ఆ సంస్థ మాత్రం ప్రీలాంచ్ పేరుతో కాకుండా ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్’ పేరుతో ప్రజల నుంచి డబ్బులను వసూలు చేసినట్టుగా రెరా గుర్తించింది.

నోటీసులు అందుకున్న సంస్థల వివరాలు ఇలా !….

1.యూనిక్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ (పికీల్‌పూర్ గ్రామం, సర్వే నెంబర్ 17/1)

2.ఎలైట్ సాయి డెవలపర్స్ వెంచర్ (సూర్యాపేట, విజయవాడ హైవే)

3.కెవిఎస్ హోమ్స్ (పిల్లలమర్రి గ్రామం, సూర్యాపేట్ సర్వే నెం. 174)

4.అక్షితా ఇన్‌ఫ్రా (విజయవాడ హైవే)

5.అలేఖ్య ఇన్‌ఫ్రా డెవలపర్స్ (సంగారెడ్డి)

6.అలేఖ్య ఎస్టేట్స్ (సంగారెడ్డి సర్వే నెంబర్ 497/బి, 498 అండ్ 499/బి పెద్దాపూర్ గ్రామం

చౌటుప్పల్ దేవులమ్మ నాగారం వద్ద ఉన్న జీ స్క్వేయిర్

7.విశ్వ డెవలపర్స్, (రాజపూర్ గ్రామం, మహబూబ్‌నగర్ సర్వే నెం. 50/పి, 140/పి, 141/పి)

8.101 ఏకర్స్

9.ఫార్మా ఎలైట్, ఫార్మా అమేజ్ , ఫార్మా నేచర్ సిటీ (సాగర్ హైవే, శ్రీశైలం హైవే, నందివనపర్తి, యాచారంలలో)

10. భువనతేజ ఇన్‌ఫ్రా

11.ఆర్‌జే హోమ్స్

12.ఏవి ఇన్‌ఫ్రా (నారాయణ ఖేడ్, సంగారెడ్డి)

13.ప్రెస్టేజ్ బేవెర్లీ హిల్స్ (బెంగళూరు కంపెనీ)

14.ఫార్చూన్ 99 (మహేశ్వరం)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News