Thursday, May 16, 2024

బిజెపి తీరు నచ్చకే రాజీనామా : మాజీ మంత్రి చంద్రశేఖర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి విధానాలు నచ్చకే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటే అని స్పష్టంగా అర్ధమవుతోందని అన్నారు. పని చేసే వారిని ప్రోత్సహించడం లేదని అందుకే తాను తన రాజీనామాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించానని తెలిపారు. ఉన్న ఫలంగా బీజేపీ అగ్ర నాయకత్వం బండి సంజయ్‌న అధ్యక్ష పదవి నుండి ఎందుకు తొలగించిందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు.

రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను బిజెపి కాపాడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని.. బిజెపిది మూడవ స్థానమేనని అన్నారు. కాగా ఇటీవలే పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించినా ఫలితం లేకపోయింది. చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బిజెపి చేరిన చంద్రశేఖర్.. తాజాగా పార్టీని వీడారు. ఈ క్రమంలోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ నెల 18న చేవెళ్లలో జరిగే కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి,ఎస్‌టి డిక్లేరేషన్ సభలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News