Saturday, April 27, 2024

రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠానికి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 7.44 శాతానికి పెరిగింది. 15 నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అంతకుముందు 2022 ఏప్రిల్‌లో సిపిఐ (వినియోగదారుల ధరల సూచీ) ఆధారిత ద్రవ్యోల్బణం 7.79 శాతం నమోదవగా, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అంతటి స్థాయికి పెరిగింది. ఈమేరకు సోమవారం కేంద్ర గణాంకాల శాఖ డేటాను విడుదల చేసింది. ఖరీదైన ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల రేట్లు పెరిగిన కారణంగా ద్రవ్యోల్బణం అధికంగా నమోదైంది. అయితే జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతంగా ఉంది.

మేలో ఇది 25 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతానికి పడిపోయింది. ఆహార ధరల సూచీ జూలైలో 11.51 శాతానికి పెరిగింది. ఇది జూన్‌లో 4.49 శాతం, మేలో 2.96 శాతంగా ఉంది. జులైలో ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ గరిష్ట పరిమితి 6 శాతం దాటింది. జూన్‌లో పట్టణ ద్రవ్యోల్బణం 4.96 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. ఇక గ్రామీణ ద్రవ్యోల్బణం 4.72 శాతం నుంచి 7.63 శాతానికి పెరిగింది. గత వారం ఎంపిసి సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్యోల్బణం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే నెలల్లో ద్రవ్యోల్బణం అంచనాలను పెంచారు. ద్రవ్యోల్బణంపై ఆర్‌బిఐ అంచనా 202324లో 5.1 శాతం నుండి 5.4 శాతానికి పెరిగింది.

టోకు ద్రవ్యోల్బణం కూడా పెరిగింది..
జులైలో టోకు ద్రవ్యోల్బణం రేటు పెరిగింది. గత నెలలో టోకు ధరల సూచిక (డబ్లుపిఐ) మైనస్ -1.36 శాతానికి చేరుకుంది. వరుసగా మూడు నెలల క్షీణత తర్వాత డబ్లుపిఐ పెరుగుదలను నమోదు చేసింది. అంతకుముందు జూన్‌లో ఇది మైనస్ -4.12 శాతానికి తగ్గగా, ఇది 8 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఉంది. కానీ 2023 జులైలో మాత్రం గణనీయంగా పెరుగుదల వచ్చింది. గత సంవత్సరం (2022) జులైలో ఇది 13.93 శాతం వద్ద ఉంది.

ఖరీదైన ఆహార పదార్థాల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ప్రధాన కారణం కూరగాయలు, ఉల్లిపాయలు, ప్రాథమిక వస్తువుల రేట్లు పెరగడమే, ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం జూన్‌లో -2.87 శాతం నుండి జూలైలో 7.57 శాతానికి పెరిగింది. మరోవైపు జూలైలో కూరగాయల ద్రవ్యోల్బణం -21.98 శాతం నుంచి 62.12 శాతానికి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News