Saturday, April 27, 2024

ఉల్లి ధరలు పైపైకి..కట్టడికి కేంద్రం చర్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని రిటైల్ మార్కెట్‌లో ఉల్లిపాయల ధర 57 శాతం మేరకు పెరిగి కిలో ఉల్లి ధర రూ. 47కి చేరుకోవడంతో వినియోగదారులు ఊరట కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ. 25కి సబ్సిడీ ధరకు విక్రయించడానికి కేంద్రం నిర్ణయించింది.

గత ఏడాదితో పోలిస్తే కిలో ఉల్లి ధర రూ. 30 నుంచి రూ. 47కి సగటున పెరిగినట్లు వినిమయ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. శుక్రవారం కిలో ఉల్లి రిలైల్ మార్కెట్ ధర దేశంలో సగటున రూ.47కి చేరుకుంది. ఆగస్టు రెండవ వారం నుంచి నిల్వ ఉంచిన ఉల్లిని రిటైల్ మార్కెట్‌లో దింపుతూ వినియోగదారులకు ఊరట నిచ్చే విధంగా ధరలను నియంత్రించడానికి చర్యలు చెపడుతున్నట్లు వినిమయ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.

ఉల్లి ధరలు బాగా పెరిగిన రాష్ట్రాలలో నిల్వ ఉంచిన ఉల్లిని హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. 22 రాష్ట్రాలలోని వేర్వేరు ప్రాంతాలలో ఆగస్టు మధ్య నుంచి దాదాపు 1.7 లక్షల టన్నుల నిల్వ ఉంచిన ఉల్లిని సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్‌సిసిఎఫ్, ఎన్‌ఎఎఫ్‌ఇడి అనే రెండు సహకార సంస్థల ద్వారా నిల్వ ఉంచిన ఉల్లిని రిటైల్ మార్కెట్‌లో కిలో రూ. 25కి సబ్సిడీ రేట్లకు అమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.

ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి నాట్లు వేయడంలో ఆలస్యం జరిగిన కారణంగా పంట చేతికి రావడం కూడా ఆలస్యమైందని, ఉల్లి కొరతకు ఇదే ప్రధాన కారణమని ఆయన చెప్పారు. ఖరీఫ్ ఉల్లి పంట ఇప్పటికే అందుబాటులోకి రావలసి ఉండగా ఇప్పటికీ రాలేదు. రబీ పంట కాలం నాటి ఉల్లి నిల్వలు తరిగిపోవడంతో ఉల్లికి హోల్‌సేల్ మార్కెట్‌తోపాటు రిటైల్ మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడిందని ఆయన వివరించారు.

2023- 2024 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌సిసిఎప్, ఎన్‌ఎఎఫ్‌ఇడి ద్వారా 5 లక్షల టన్నుల ఉల్లిని కేంద్రం నిల్వ చేసింది. రానున్న రోజుల్లో మరో 2 లక్షల టన్నుల ఉల్లిని నిల్వ చేయాలని కేంద్రం భావిస్తోంది. రానున్న రోజుల్లో ఉల్లి లభ్యతను మెరుగుపరిచి, ధరలను నియంత్రించడానికి ఈ చర్యలు ఉపకరిస్తాయని ఆ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News